
శ్రీశైలం, ఫిబ్రవరి 20: నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్న ఆలయానికి భారీగా హుండీ ఆదాయం లభించింది. హుండీ లెక్కింపు కార్యక్రమం సుదీర్ఘంగా జరిగింది. దేవస్థానంలో భక్తులు మొక్కులు రూపంలో చెల్లించుకున్న హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ రాత్రికి ముగిసింది. గత 13 రోజులకు సంబంధించి వచ్చిన ఆదాయం వివరాలను అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీకి అనుగుణంగానే హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. ఈనెల 8 నుంచి 18 వరకు అంటే గత 13 రోజులు కాలంలో భక్తులు సమర్పించిన కానుకలను ఈరోజు లెక్కించారు.
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి రూ.5 కోట్ల 61 లక్షల 81 వేల 535 రూపాయల నగదు రాబడిగా లభించిందని తెలిపారు. కేవలం నగదు మాత్రమే కాకుండా భక్తులు పెద్ద ఎత్తున బంగారం, వెండి ఆభరణాలను కూడా మొక్కులుగా చెల్లించుకున్నారు. భారతీయ కరెన్సీతో పాటు విదేశీ భక్తులు కూడ తమ భక్తిని చాటుకున్నారు. ఈ ఆదాయాన్ని గత 13 రోజులలో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు కానుకల రూపంలో సమర్పించినట్లు చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
హుండి లెక్కింపులో నగదుతో పాటు 124 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం, అలానే వెండి 5 కేజీల 550 గ్రాములు వచ్చినట్లు తెలిపారు. నగదు, బంగారంతో పాటు యుఎస్ఏ డాలర్లు 22, యు.ఎ.ఇ దిర్హమ్స్ 10, ఇంగ్లాండు ఫౌండ్స్ 25, సింగపూర్ డాలర్లు 4, ఒమన్ బైసా 100, ఆస్ట్రేలియా డాలర్లు 15, థాయిలాండ్ భట్స్ 100, యూరోలు 5, మలేషియా రింగిట్స్ 1 వంటి పలు విదేశీ కరెన్సీ కూడా ఉన్నట్లు తెలిపారు. హుండీల లెక్కింపు ప్రక్రియంత అత్యంత పారదర్శకంగా, పటిష్టమైన భద్రత ఏర్పాట్లు మధ్య జరిగిందని, సీసీ కెమెరాలు నిఘాలో ఈ హుండీ లెక్కించామని అన్నారు. హుండీ లెక్కింపులో దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు పలు విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, సిబ్బంది, శివసేవకులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.