రెండ్రోజుల క్రితం సముద్రంలో ఆటుపోట్లు.. సడెన్గా తీరంలో ప్రత్యక్షమైన విగ్రహాలు!
బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో శివలింగ పీఠంతో పాటు గుర్తు తెలియని దేవతా విగ్రహాలు కొట్టుకు రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తీరంలో వీటిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకొని.. అవి ఎక్కడి నుంచి వచ్చాయని తేల్చే పనిలో పడ్డారు.

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బాయిపాలెం సముద్ర తీరంలో అటూ, పోటుకు సముద్ర తీరప్రాంతం పెద్ద మొత్తంలో కోతకు గురైంది. వీటి కారణంగా తీరంలో పెద్ద ఎత్తున ప్రమాదకరమైన గుంతలు ఏర్పడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈక్రమంలో కొత్తపట్నం మెరైన్ సిఐ రామేష్ బాబు , వేటపాలెం తహసీల్దార్ గీత రాణి, సివిల్ పోలీసులు తీర ప్రాంతాన్ని పరిశీలించారు. ఆదివారం సేలవు దినం కావడంతో తీర ప్రాంతానికి పెద్దఎత్తున పర్యాటకులు వచ్చే అవకాశం వుండటంతో అధికారులు వెంటనే స్థానికంగా ఉన్న పర్యాటకులను అప్రమత్తం చేశారు.
పొట్టిసుబ్బాయిపాలెం తీరంలో రెండు కిలో మీటర్ల మేర పర్యాటకులు సముద్ర స్నానాలు ఆచరించకుండా చర్యలు చేపట్టారు. సముద్రంలో ఏర్పడిన వాతావరణ మార్పులు కారణంగా తీరం నుంచి 20 మీటర్ల వరకు అలాగే పొట్టిసుబ్బాయిపాలెం తీరం వెంబడి రెండు కిలో మీటర్ల పొడవునా తీవ్రమైన కోతకు గురైందని భావిస్తున్నారు. ఫలితంగా ఒడ్డుకు సమీపంగా 10 అడుగుల మేర గుంతలు ఏర్పడ్డాయని, పర్యాటకులు ప్రమాదాలకు గురికాకుండా చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
ఈ నేపధ్యంలో పొట్టి సుబ్బయ్యపాలెం సముద్ర తీరానికి శివలింగ పీఠం, గుర్తు తెలియని దేవతా విగ్రహాలు కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు. విగ్రహాలు సముద్రం లోపలి నుంచి అలల తాకిడికి కొట్టుకొచ్చాయా? లేక ఇటీవల తీరంలో ఏర్పడిన గుంతల కింద నుంచి కొట్టుకొచ్చాయా? అనేది ఈ విగ్రహాల రాకపై అధికారులు పరిశీలన జరిపి పూర్తి వివరాలు వెల్లడించిన తర్వాతే తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
