Secunderabad Army Hospital: నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వైద్య పరీక్షలపై సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. రఘురామకృష్ణం రాజుకు ముగ్గురు వైద్యుల మెడికల్ బోర్డ్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణంరాజు ఉండనున్నారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఎంపీ రఘురామకు అన్ని ఏర్పాట్లు చేశామని.. ఆయన ఆర్మీ ఆసుపత్రిలోనే ఉంటారని అధికారులు తెలిపారు.
కాగా.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి సోమవారం రాత్రి రోడ్డు మార్గాన తరలించారు. అనంతరం రఘురామకృష్ణంరాజుకు నిర్వహించిన వైద్య పరీక్షలను అధికారులు వీడియోలో చిత్రీకరించారు. ఈ నివేదికను తెలంగాణ హైకోర్టు జనరల్కు సీల్డ్ కవర్లో పంపనున్నారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు ఈ నివేదికను చేరవేయనున్నారు. అనంతరం ఈ కేసుపై ధర్మాసనంలో విచారణ జరగనుంది. రఘురామకృష్ణంరాజు పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు విచారించిన సంగతి తెలిసిందే.
Also Read: