Andhra: వాహనాల హెడ్‌లైట్లు పడడంతో మెరుస్తూ కనిపించింది.. దగ్గరికి వెళ్లగా

చిమ్మచీకటిలో రహదారిపై ఒక్కసారిగా హెడ్‌లైట్లు పడగానే భారీ కొండచిలువ కదలిక… వాహనాలు ఒక్కసారిగా బ్రేక్… గ్రామస్తుల్లో ఆందోళన. విజయనగరం జిల్లా జామి మండలం శాసనాపల్లిలో రాత్రివేళ కొండచిలువ ప్రత్యక్షమవడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. పరిసర ప్రాంతాల్లో వన్య ప్రాణులు సంచారం పెరుగుతుండటంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Edited By:

Updated on: Feb 21, 2026 | 9:24 PM

విజయనగరం జిల్లా జామి మండలం శాసనాపల్లిలో రాత్రి సమయంలో కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ప్రధాన రహదారిపై నుంచి కల్వర్టు వైపు కదులుతూ వెళ్తున్న భారీ కొండచిలువను కొందరు వాహనదారులు గమనించి ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. చిమ్మ చీకటి కావడంతో వాహనాల హెడ్‌లైట్లు పడడంతో కొండచిలువ స్పష్టంగా కనిపించింది. దీంతో డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాదాన్ని తప్పించగలిగారు. అయితే వాహనదారుల శబ్దాలకు కొండచిలువ కొంతసేపు హాల్ చల్ చేసింది. రోడ్డుపై అటూ ఇటూ సంచరిస్తూ స్థానికుల్లో ఆందోళన రేపింది. కొండచిలువ రహదారిపై సంచరిస్తున్న తీరు చూసి పలువురు వాహనదారులు, ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. సాధారణంగా పగటి పూట జనసంచారం ఎక్కువగా ఉండే ఈ మార్గంలో రాత్రి ఈ విధంగా కొండచిలువ ప్రత్యక్షమవడం అరుదుగా జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. రహదారి పక్కనే ఉన్న చెట్లతో నిండి ఉన్న గెడ్డల ప్రాంతం వైపు ఆ కొండచిలువ నెమ్మదిగా జారుకొని వెళ్లిపోయింది. అది వెళ్లిపోయే వరకు కొంతసేపు అక్కడ ట్రాఫిక్ సైతం నిలిచిపోయింది. కొండచిలువ ఉన్నంతసేపు వాహనాలను కదిలించకుండా ఎక్కడివారు అక్కడ నిలిచిపోయారు. కొండచిలువ సంచారంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లిందోనన్న గ్రామస్తుల్లో భయం నెలకొన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల కాలంలో ఈ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం పెరుగుతోందని, అటవీ శాఖ రాత్రి వేళల్లో పహారా పెంచాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామం చుట్టుపక్కల ఉన్న ఎడారివైపు అడవి విస్తరించడం, పంటచేనుల ప్రాంతం కావడంతో జంతువులు గ్రామంలోకి వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us