
పుష్ప సినిమాలో పాల ట్యాంకర్లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన సీన్ను గుర్తుచేస్తూ.. అనంతపురం జిల్లాలో అదే తరహాలో సాగుతున్న గోవా మద్యం అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. లారీ క్యాబిన్లో రహస్య బాక్సులు ఏర్పాటు చేసి గోవా నుంచి తీసుకొచ్చిన భారీ మద్యం నిల్వలను తాడిపత్రి పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాడిపత్రి రైల్వే స్టేషన్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఓ లారీపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పైకి సాధారణ లారీలా కనిపిస్తున్నప్పటికీ, క్యాబిన్ వెనుక భాగంలో అత్యంత చాకచక్యంగా ప్రత్యేక బాక్సులు తయారు చేసినట్లు గుర్తించి ఖాకీలే ఆశ్చర్యపోయారు. ఆ అరలను తెరిచి చూడగా భారీగా గోవా మద్యం బయటపడింది.
సీక్రెట్ అరల్లో దాచిన దాదాపు 400 గోవా మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పేందుకు నిందితులు లారీకి రెండు వేర్వేరు నంబర్ ప్లేట్లను ఉపయోగించారు. ఏపీ, కర్ణాటక రిజిస్ట్రేషన్ ప్లేట్లను మారుస్తూ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులను సునాయాసంగా దాటించి తాడిపత్రికి చేర్చారు. పోలీసుల రాకను గమనించిన లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు.
గోవా నుంచి తాడిపత్రికి ఈ మద్యం ఎవరి కోసం తీసుకొచ్చారు? ఈ స్మగ్లింగ్ నెట్వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. లారీతో పాటు మద్యం బాటిళ్లను సీజ్ చేసిన తాడిపత్రి పోలీసులు, పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.