
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. అనుమానం భూతమే.. ఈ ఘటనకు కారణమని.. గొడవ అనంతరం భార్యను చంపిన భర్త.. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు పేర్కొంటున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం పిచ్చుకలగుడిపాడు గ్రామంలో ఫలతోటి రామారావు(45), ఫలతోటి అరుణ (40) భార్యాభర్తలు.. కుటుంబ కలహల కారణంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా రామారావుకు భార్య అరుణ ప్రవర్తనపై అనుమానాలు ఉన్నాయి. గత కొంత కాలంగా అనుమానం.. పెనుభూతమై.. గొడవలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రాత్రి కూడా ఎప్పటిలాగే భార్యాభర్తలు గొడవలు పడ్డారు. అయితే, ఈసారి కోపంలో భర్త రామారావు భార్య అరుణపై దాడి చేసి తీవ్రంగా కొట్టడంంతో ఆమె చనిపోయింది. ఆ తరువాత తాను కూడా పరుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు.
ఈ విషయం తెలుసుకుని.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను శవపంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షణికావేశంలో తల్లిదండ్రులు తీసుకున్న ఈ దారుణ నిర్ణయంతో ఆ పిల్లలు అనాథలుగా మారారు. అన్యోన్యంగా ఉండాల్సిన సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయడంతో పిచ్చుకలగుడిపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..