
పెదకాకాని భ్రమరాంబ అమ్మవారి మాయమైన మంగళసూత్రాన్ని పోలీసులు ఎట్టకేలకు పట్టుకోగలిగారు. శ్రావణ మాసం మొదటి శుక్రవారమే మంగళసూత్రం, నాను తాడు కనిపించకుండా పోవడంపై పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి విశేష అలంకరణ చేశారు. దీంతో ఆదివారం వరకూ అలంకరణ ఉంచాలని అర్చకులు నిర్ణయించారు. అయితే సోమవారం అలంకరణ తొలగించారు. అలంకరణ తొలగించిన తర్వాత అమ్మవారి మంగళసూత్రం, నానుతాడు కనిపించడం లేదని గుర్చించారు. పూలదండలతో పాటు తీసివేసే సమయంలో పొరపాటున పోయి ఉంటుందని అంతా వెదికారు. అయినా ఆభరణం లభించలేదు. దీంతో ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు మొదట నుండి అర్చకుల మీదనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఎందుకంటే గర్భగుడిలోకీ ఇతరులు వెళ్ళే అవకాశం లేదని తప్పకుండా పూజారులే తీసి ఉంటారన్న భావన వ్యక్తం అయింది.
ఈ క్రమంలో ఆభరణం పోయిన సమయంలో విధి నిర్వహణలో ఉన్నా అర్చకులను పోలీసులు విచారించారు. అదనపు అర్చకుడిగా ఉన్న రణధీర్ పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో అతని ప్రశ్నించారు. అతను మాత్రం తాను ఆభరణం తీయలేదంటూ వాదించాడు. ఇదే సమయంలో అతని ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. పరుపు కింద మంగళసూత్రం నానుతాడు కనిపించాయి. దీంతో అతన్ని అరెస్ట్ చేశారు.
పర్మినెంట్ అర్చకులకు అర్చన ప్లేటులో భక్తులు వేసే డబ్బులతో ఆదాయం అధికంగా ఉండటాన్ని అదనపు అర్చకుడిగా ఉన్న రణధీర్ గమనించాడని తనకు ఆ స్థాయిలో ఆదాయం లేకపోవడంతో అత్యాశకు పోయి అమ్మవారి బంగారు ఆభరణాన్ని దొంగలించినట్లు డిఎస్పీ మురళి క్రిష్ణ చెప్పారు. 68 గ్రాముల బంగారు ఆభరణాన్ని స్వాధీనం చేసుకొని ఆలయానికి అప్పగించనున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..