
చిత్తూరు జిల్లాలో పట్టుబడ్డ అంతర్రాష్ట్ర దొంగలముఠాకు పెద్ద నేర చరిత్రనే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇటీవలే ఓ ఇంటి దొంగతనం కేసులో ముగ్గురు అంతరాష్ట్ర దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి రూ. 50 లక్షల విలువగల బంగారు, వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గదిడాది జూలై 15న పలమనేరులోని అయ్యాకన్ను వీధిలో ఉంటున్న బాలాజీ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగిన దొంగతనంపై జూలై 18 న పలమనేరు అర్బన్ పిఎస్ లో కేసు నమోదయింది. ఈ కేసులు ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సాంకేతిక ఆధారాలతో విస్తృతంగా విచారణ నిర్వహించారు.
దర్యాప్తులో లభించిన కీలక ఆధారాలుతో అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసారు. చిత్తూరు బెంగళూరు హైవేపై నాగమంగళం ఫ్లై ఓవర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వారి గురంచి విచారించగా అసలు నేర చరిత్రను బయటపడింది. పట్టుబడిన వారిలో గుంటూరుకు చెందిన రాయపాటి వెంకయ్య, పల్నాడు జిల్లాకు చెందిన షేక్ నాగుల్ మీరా, గుంటూరుకు చెందిన తుక్కింటి తులసి రామిరెడ్డి ఉన్నట్టు గుర్తించారు. వీరు పలు రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు గుర్తించారు.
చిత్తూరు జిల్లా లోని పలమనేరు పుంగనూరు గంగవరం మండలాల్లో దొంగతనాలు పాల్పడిన ఇదే ముఠా ఇంతకు ముందు పుంగనూరులో ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి 76 గ్రాముల బంగారు, పుంగనూరు, క్రిష్ణగిరి గంగవరం లో చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాయపాటి వెంకయ్యపై వందకు పైగా కేసులు ఉన్నట్లు తెలిపారు. ఇక ఏ2 షేక్ నాగూర్ మీరా పై 75 కేసులు,ఏ3గా ఉన్న తులసి రామిరెడ్డి పై ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
వీరు కేవలం చిత్తూరు జిల్లాలోనే కాకుండా బెంగళూరులోని ముల్బాగల్, బంగారుపేట, కోలార్, క్రిష్ణగిరిలో పలు నేరాలకు పాల్పడిన పోలీసులు గుర్తించారు. వీరు కోలార్లో కేజీ పైగా బంగారు దొంగతనం చేసినట్లు తెల్చారు. పలు పోలీస్ స్టేషన్లలో వారెంట్లు పెండింగ్లో ఉండగా నిందితుల వద్ద నుండి 210 గ్రాముల బంగారు, రెండు మోటార్ సైకిళ్ళు, ఒక కారును పోలీసులు సీజ్ చేశారు. మోస్ట్ వాంటెడ్ దొంగల ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను అభినందించారు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.