Oxygen Shortage: ఏపీకి ప్రాణవాయువు కొరత ప్రమాదం..కేంద్రం కేటాయించిన మేర రాష్ట్రానికి చేరని ఆక్సిజన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ ఆశించిన స్థాయిలో సరఫరా కావడం లేదు. కేంద్రం జరిపిన కేటాయింపుల ప్రకారం ఆక్సిజన్ ఏపీకి రావడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయని చెబుతున్నారు.

Oxygen Shortage: ఏపీకి ప్రాణవాయువు కొరత ప్రమాదం..కేంద్రం కేటాయించిన మేర రాష్ట్రానికి చేరని ఆక్సిజన్
Oxygen Supply

Updated on: Apr 27, 2021 | 1:08 PM

Oxygen Shortage:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆక్సిజన్ ఆశించిన స్థాయిలో సరఫరా కావడం లేదు. కేంద్రం జరిపిన కేటాయింపుల ప్రకారం ఆక్సిజన్ ఏపీకి రావడం లేదు. దీనికి చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఉంది. కానీ, కేంద్రం కేటాయించిన ప్రకారం ఏపీకి ఆక్సిజన్ సరఫరా జరిగితే ఇబ్బంది ఉండదు. మిగిలిన రాష్ట్రాల్లో కేటాయింపుల కంటె ఎక్కువ డిమాండ్ ఉంది. ఏపీలో అలాలేదు. అయితే, కేటాయింపుల మేర కూడా ఆక్సిజన్ సరఫరా జరగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం ఏపీ కోసం 480 టన్నుల ఆక్సిజన్ కేటాయించింది. కానీ, 340 టన్నులు చేరడమే గగనంగా మారిందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆక్సిజన్ సరఫరా చేసే టాంకర్ల కొరత దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు. ఒడిశా నుంచి కేంద్రం 20 టన్నుల ఆక్సిజన్ ఎపీకి కేటాయించింది. రూర్కెలా నుంచి ఇది రావాలి. దీనికి 3 నుంచి 4 రోజుల సమయం పడుతోంది.

ఇక శ్రీపెరంబుదూరు, బళ్లారి అలాగే ఇతర చోట్ల నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ పూర్తిస్థాయిలో రావడం లేదు. విశాఖ నుంచి వచ్చే ఆక్సిజన్ మాత్రమె తగినంతగా వస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాబోయే రెండు మూడు వారాలకు 500 నుంచి 550 టన్నుల ఆక్సిజన్ ఎపీకి అవసరం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈలోపు ఆక్సిజన్ సరఫరా పెరగకపోతే చిక్కుల్లో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇటీవల విశాఖపట్నం నుంచి మహారాష్ట్ర కు భారీగా ఆక్సిజన్ పంపించారు. దీని ప్రభావం రాష్ట్రం మీద పడింది.

వృధా ఆపాలి..

ఇంతకు ముందు ఆక్సిజన్ అధికంగా అవసరమైన సెప్టెంబర్ నెలలో రెండు రోజులకు 260 టన్నుల ఆక్సిజన్ ఉపయోగించారు. కానీ, ఇప్పుడు అంత స్థాయిలో కేసులు లేవు.. అయినా 300 టన్నులకు పైగా వాడుతున్నారు. ఈ విషయాన్ని ఏపీ ఆరోగ్యశాఖా మంత్రి ఆళ్ళ నాని ఇటీవల చెప్పారు. దాదాపుగా 30 శాతం ఆక్సిజన్ వృధా అవుతోందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి మొత్తం 390 టన్నుల ఆక్సిజన్ అవసరం. అయితే, 300 టన్నులు మాత్రమె వస్తోంది. మరోవైపు కేంద్రం 340 టన్నుల ఆక్సిజన్ రాష్ట్రానికి కేటాయించిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. పల్స్‌ ఆక్సీమీటరులో 96% ఉన్నవారు.. ఐసీయూల్లోనూ కొందరికి అవసరం లేకపోయినా ఆక్సిజన్‌ వాడుతున్న విషయాన్ని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఆసుపత్రుల వారీగా ఆక్సిజన్‌ సరఫరా, వినియోగం లెక్కలు తీస్తున్నామనీ, ఆక్సిజన్ వృధా కాకుండా అవసరమైన చర్యలు తీసుకున్తున్నామనీ ఆయన వెల్లడించారు.

Also Read: Corona effect: కరోనా కాటుకు మరో పూజారి బలి.. ఆరోగ్యం విషమించి బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అర్చకుడు మృతి

GVMC Demolition: విశాఖలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా భవనం కూల్చివేత.. అక్రమ నిర్మాణాలను కూల్చివేశామన్న జీవీఎంసీ అధికారులు