
తిరుమల శేషాచలం అడవులు అరుదైన జీవ వైవిద్యానికి కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అడవుల్లో పామును పోలి ఉండే అరుదైన కొత్త జాతి జీవిని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ZSI) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అరుదైన జీవికి ‘డెక్కన్ గ్రాసైల్ స్కింక్’గా నామకరణం చేశారు.
అచ్చం పాము పోలికలతో.. పాక్షిక పారదర్శక కనురెప్పలతో.. విభిన్న చారలతో ఈ స్కింక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. శేషాచలం రిజర్వ్ ఫారెస్ట్ తూర్పు కనుమల్లో కనిపించిన ఈ జీవి.. తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో కూడా కనిపించినట్లు చెబుతున్నారు. జీవవైవిధ్యానికి ప్రతీకగా ఈ కొత్త జాతి నిలుస్తుందని ZSI డైరెక్టర్ డాక్టర్ ధ్రితి బెనర్జీ తెలిపారు. తిరుమల అటవీ ప్రాంతాల్లో ఇంకా ఎన్నో అపరిచిత జీవులుండవచ్చుననే ఊహలను ఈ సరికొత్త జీవి మరింత బలపరుస్తోంది.
ఈ పరిశోధన జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హైదరాబాద్ కేంద్రం, కోల్కతా రెప్టిలియా విభాగం, లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం శాస్త్రవేత్తల సహకారంతో పూర్తయిందని జడ్ఎస్ఐ ప్రతినిధి డాక్టర్ దీపా జైస్వాల్ తెలిపారు. ఈ పరిశోధన జీవవైవిధ్య పరిరక్షణలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.