NDA Alliance Rebels: అరుపులూ అలకలు.. కూటమిలో లుకలుకలు.. సమన్వయం సాధ్యమేనా?
జెండాలు జతకట్టాయి.. అధినేతలు చేతులు కలిపారు. కలిసి సీట్లు పంచుకున్నారు. అంతా బాగుందనుకున్నా అసలు విషయమే తేడాకొడుతోంది. కీలకమైన సమన్వయంలేక కూటమిలో కలకలం రేగుతోంది. నామినేషన్లవేళ ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతేమో గానీ, స్వపక్షంలోనే విపక్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కూటమి అభ్యర్థులు.
జెండాలు జతకట్టాయి.. అధినేతలు చేతులు కలిపారు. కలిసి సీట్లు పంచుకున్నారు. అంతా బాగుందనుకున్నా అసలు విషయమే తేడాకొడుతోంది. కీలకమైన సమన్వయంలేక కూటమిలో కలకలం రేగుతోంది. నామినేషన్లవేళ ఎక్కడికక్కడ లుకలుకలు బయటపడుతున్నాయి. ప్రత్యర్థుల సంగతేమో గానీ, స్వపక్షంలోనే విపక్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కూటమి అభ్యర్థులు.
పొత్తులో సీటు దక్కలేదన్న బాధ కొందరికి, ఎన్ని ప్రయత్నాలు చేసినా టికెట్ దక్కలేదన్న ఆక్రోశం ఇంకొందరిది. నామినేషన్ల పర్వం మొదలైపోయినా విపక్ష కూటమిలో కుంపట్లు మాత్రం ఇంకా చల్లారడం లేదు. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే కర్నూలు దాకా కూటమి పక్షాల మధ్య లుకలుకలు, గందరగోళం. ఏదో ఒకటో రెండోకాదు దాదాపు 20కిపైగా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. సొంత పార్టీలోనే ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు కూటమి అభ్యర్థులు.
అరకు లోక్సభ బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత… సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. గీతపై తీవ్ర ఆరోపణలుచేసిన నిమ్మక జయరాజ్… బీజేపీ రెబల్గా బరిలోకి దిగారు. దాంతో, అరకు కాషాయదళంలో కలవరం మొదలైంది. ఎచ్చెర్ల బీజేపీలోనూ అసమ్మతి సెగ కల్లోలం రేపుతోంది. బీజేపీ అభ్యర్థి ఈశ్వరరావు అభ్యర్థిత్వాన్ని అక్కడి బీజేపీ నేతలు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఎచ్చర్ల టికెట్ ఆశించిన రమ్య… ఈశ్వరరావుపై రెబల్గా పోటీకి రెడీ అవుతున్నారు.
బీజేపీలో అక్కడక్కడే. టీడీపీలో చాలాచోట్ల ఇదే పరిస్థితి. విజయనగరం సీటును మళ్లీ అదితి గజపతిరాజుకే ఇవ్వడంతో రెబల్గా బరిలోకి దిగారు మీసాల గీత. అధినాయకత్వం కబురుపెట్టినా రాజీకి రెడీగా లేరు మహిళా నేత. పార్వతీపురంలో కూడా సేమ్ సిట్యువేషన్. ఇక్కడ బోనెల విజయ్చంద్రకు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. దాంతో టికెట్ ఆశించి భంగపడ్డ ఉదయభాను రెబల్గా బరిలోకి దిగుతున్నారు. ఇక, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం టీడీపీలోనూ అసమ్మతి తీవ్రస్థాయికి చేరింది. మామిడి గోవిందరావుకు టికెట్ కేటాయించడంతో కలమట వెంకటరమణ అసంతృప్తిలో రగిలిపోతున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఈనెల 24న నామినేషన్ వేయబోతున్నారు కలమట.
కోస్తాంధ్ర టీడీపీలోనూ రెబల్ బెడద కనిపిస్తోంది. టికెట్ దక్కకపోవడంతో టీడీపీకి రాజీనామా చేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. నూజివీడు బరిలోకి దిగుతున్నారు. ఆమధ్య వైసీపీలో చేరతారని ప్రచారం జరిగినా…. తెలుగుదేశంలోనే కొనసాగుతూ ఆ పార్టీ రెబల్గా పోటీకి రెడీ అవుతున్నారు ముద్దరబోయిన. ఇవన్నీ ఒకత్తయితే ఉండి నియోజకవర్గానిది మరో లెక్క. ఇక్కడ రాజు వర్సెస్ రాజుగా జరుగుతోన్న ట్రయాంగిల్ ఫైట్.. టోటల్ ఏపీలోనే హాట్ టాపిక్కైంది. ముగ్గురు రాజుల మధ్య టికెట్ ఫైట్ నడుస్తుండగానే.. రఘురామరాజు నుంచి నామినేషన్ పడటంతో ఉండి రాజకీయం మరింత వేడెక్కింది.
ఉండి పొలిటికల్ డ్రామాకి మించిపోయింది అనపర్తి రాజకీయం. ఇక్కడ కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కార్యకర్తల్ని ఊపిరిబిగబట్టేలా చేస్తున్నాయ్. మొదటి లిస్ట్లోనే అనపర్తి అభ్యర్ధిగా నల్లమిల్లి పేరును ప్రకటించారు చంద్రబాబు. కానీ, బీజేపీతో పొత్తు తర్వాత అనపర్తి రాజకీయం అనూహ్యంగా మారిపోయింది. అనపర్తి సీటును బీజేపీకి కేటాయించడంతో రచ్చ మొదలైంది. నల్లమిల్లి మూడు వారాలుగా చేసిన న్యాయపోరాటం కూటమిలో కల్లోలం రేపింది. చివరికి చంద్రబాబు, పురంధేశ్వరి నుంచి నల్లమిల్లికి పిలుపురావడంతో… అనపర్తిని మళ్లీ టీడీపీకే దక్కుతుందనే ప్రచారం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటనేదీ రాకుండానే నల్లమిల్లి సతీమణి మహాలక్ష్మి నామినేషన్ వేయడం కలవరం రేపుతోంది. పైగా కూటమి అభ్యర్థిని తానేనని నల్లమిల్లి ప్రచారం చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది
నెల్లూరు జిల్లా కందుకూరులో ఇంటి పోరుతో తల పట్టుకుంటున్నారు టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వర్రావు. టికెట్ ఆశించి భంగపడ్డ ఇంటూరి రాజేష్ ఇక్కడ రెబల్గా బరిలోకి దిగుతున్నారు. కడపజిల్లాలోనూ టికెట్లు దక్కని టీడీపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరో పార్టీలో చేరాలా, రెబల్స్గా బరిలోకి దిగాలా అన్న ఆలోచనతో కొందరున్నారు. ఇవేకాదు… చీపురుపల్లి, ఎమ్మిగనూరు, నంద్యాల, మంత్రాలయంలో రెబల్స్ బెడదని ఫేస్ చేస్తున్నారు కూటమి అభ్యర్థులు. నామినేషన్ల పర్వం ముగిసేనాటికి ఈ నెంబర్ మరింత ఎక్కువయ్యేలా ఉంది. మరి, విత్డ్రాల్లోపు ఇవన్నీ కుదురుకుంటాయో.. లేకుంటే కూటమిని కాటేస్తాయో చూడాలి!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…