Nara Lokesh: ఆ ఏడుకొండల వాడిపై ప్రమాణం చేసేందుకు రెడీనా.. సీఎం జగన్ లోకేశ్ సవాల్

|

Sep 27, 2022 | 3:26 PM

ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం తెర పైకి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్...

Nara Lokesh: ఆ ఏడుకొండల వాడిపై ప్రమాణం చేసేందుకు రెడీనా.. సీఎం జగన్ లోకేశ్ సవాల్
Nara Lokesh
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అధికార, విపక్షాల మధ్య రాజకీయ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. మరోసారి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం తెర పైకి వచ్చింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ పై టీడీపీ లీడర్ నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తిరుమలకు వెళ్తున్న సీఎం అక్కడ ఈ విషయంపై ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని గతంలోనే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రమాణం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. దీంతో తన బాబాయ్‌ హత్యతో ఎలాంటి సంబంధం లేదని తిరుమలేశుడి సాక్షిగా ప్రమాణం చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారా అని నిలదీశారు. అంతకుముందు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంపై లోకేశ్ స్పందించారు. ఈ అంశంపై సీబీఐ విచారణ చేపట్టాలని లోకేశ్ గతంలో డిమాండ్ చేశారు. బాబాయి వివేకా హత్యకు హత్యకు స్కెచ్ వేసింది ముఖ్యమంత్రేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాబాయి వివేకానందని అత్యంత కిరాతకంగా చంపేసిన అవినాష్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి తన రెండు కళ్లు అని చెప్పడం, సీబీఐకి అప్పగిస్తే ఇది 12వ కేసు అవుతుందనడం చూస్తుంటే హత్యకు స్కెచ్ వేసింది జగన్ రెడ్డేనని స్పష్టంగా అర్థమవుతోందని లోకేశ్ మండిపడ్డారు.

కాగా.. ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న వ్యక్తికి మూడు నెలల్లో బెయిల్ ఇచ్చారని అభిషక్ మను సింఘ్వి చెప్పారు. కానీ 11 నెలలు అవుతున్నా, ఎలాంటి సాక్ష్యాలు లేకపోయినా శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం లేదని వాదించారు. కాబట్టి వెంటనే శివశంకర్ రెడ్డి బెయిల్ ఇవ్వాలని కోరారు. సింఘ్వీ వాదనల అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసం స్పష్టం చేసింది.

మరోవైపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప జిల్లాలో పలువురిని విచారించిన అధికారులు.. అప్పటి పోలీసు ఉన్నతాధికారుల నుంచి కీలక విషయాలను అడిగి తెలుసుకున్నారు. దీంతో వైఎస్ వివేకా కూతురు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల ముందు తన ఇంట్లోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైయ్యారని చెప్పారు. ఈ ఘటన అప్పట్లో పెను సంచలనం కలిగించింది. హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆయన కుటుంబసభ్యులు కోరారు.

కానీ వైసీపీ అధికారంలోనికి వచ్చినా వివేకా హత్య కేసు విషయంలో ఒక స్పష్టత రాలేదు. దర్యాప్తు సంస్థ అధికారులు సాక్ష్యులను బెదిరిస్తున్నారని, కాబట్టి ఈ కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వివేక కుమార్తె సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సునీత పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం.. సీబీఐ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..