
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ప్రముఖ యూట్యూబర్ నందన కేసులో బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగాలు, వీసాల రెన్యూవల్ పేరుతో మోసాలకు పాల్పడ్డారనే కేసులో తాజాగా పోలీసుల విచారణకు హాజరయ్యారు రమానందన. ఆమెను దాదాపు నాలుగు గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు.. ఈ కేసులో కీలకంగా ఉన్న డెస్టినీ కన్సల్టెన్సీ ఎవరిది, దాని ఓనర్ ఎవరు అనే కీలక ప్రశ్నలు అడిగారు. అయితే ఈ విచారణలో ఆమె కొన్ని కీలక విషయాలు చెప్పింది. డెస్టినీ కన్సల్టెన్సీ గురించి తనకు ఏమీ తెలియదని.. దాన్ని తన భర్త మధుకర్ మెయింటైన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆ కన్సల్టెన్సీ వ్యవహారాల్లో తన జోక్యం ఏమాత్రం లేదని నందన తెలిపింది.
తన నుంచి డబ్బులు తీసుకొని మోసం చేశారని ఇబ్రహీంపట్నానికి చెందిన శివక్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నందనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. అప్పటి నుంచి ఆమె ఆచూకీ తెలియకపోవడంతో లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా ఆమె లండన్ నుంచి హైదరాబాద్ రాగా.. అక్కడ లుక్ఔట్ నోటీసుల ఆధారంగా ఆమెను గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు.. అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించగా.. విచారణకు రావాలని ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో నందన, తన తల్లి, లాయర్తో పాటు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఆమెను ప్రశ్నించిన పోలీసులు.. ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించారు.
అయితే నందన పోలీస్ స్టేషన్కు వచ్చిన విషయం తెలుసుకున్న ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన కొందరు బాధితులు అక్కడికి చేరుకున్నారు. తాము కూడా ఈ కేసులో డబ్బులు పోగొట్టుకున్నామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొనగా పోలీసుల చొరవతో వివాదం సద్దుమణిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.