
రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తుంది ఎన్నికల కమిషన్. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు. అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఎన్నికల ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షలు చేస్తున్నారు. తాజాగా మరోసారి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో జీరో వయెలెన్సు, నో రీపోల్ ప్రధానంగా ఎన్నికలు జరగాలన్నారు. అందుకు అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లు ప్రణాళికా బద్దంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఎన్నికల సంసిద్దతకు తీసుకుంటున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశించిన ప్రకారం పూర్తి పారదర్శకంగా ఎలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా ఎన్నికలు జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. నో వైలెన్స్ అమల్లో ఎటు వంటి తేడా వచ్చినా అందుకు సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుదనే విషయాన్ని గమనించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎంతో పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలేగాని, ఎటు వంటి హింసకు తావు ఉండకూడదన్నారు. ఈ విషయంలో ఎటు వంటి తేడా వచ్చినా సరే భారత ఎన్నికల సంఘం ఉపేక్షింబోదనే విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు పటిష్టంగా పనిచేసే విధంగా ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకోవాలని, బూత్ క్యాప్చరింగ్కు ఎటు వంటి అవకాశం లేకుండా పటిష్టమై బందోబస్తు ఏర్పాట్లను కూడా చేసుకోవాలని సూచించారు.
త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండటంతో ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకి ముందు జిల్లా ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లు తీసుకోవాల్సిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖేష్ కుమార్ మీనా వివరించారు. కంట్రోల్ రూముల ద్వారా నిరంతర పర్యవేక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని ముఖ్యమై ఆదేశాలు, రాజకీయ పార్టీల అనధికార ప్రకటనలు, 50 శాతం పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల ప్రక్రియ వెబ్ కాస్టింగ్, ఎన్నికల షెడ్యూలు ప్రకటన తదుపరి రోజూ వారీ పంపాల్సిన నివేదికలు తదితర అంశాలను జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెట్లు, పోలీస్ కమిషనర్లకు ఆయన వివరించారు. ఓటర్ల గుర్తింపు కార్డుల పంపిణీ పక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల గుర్తింపు కార్డులను తప్పనిసరిగా పోస్టల్ ద్వారానే పంపిణీ చేయాలని.. ఒక్క పాడేరు ప్రాంతం మినహా మరే ఇతర ప్రాంతాల్లో మాన్యువల్గా పంపిణీ చేయడానికి వీలులేదనే విషయన్ని గుర్తించాలన్నారు. సకాలంలో పోస్టల్ ద్వారానే బట్వాడా చేయడానికి పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెండింగ్ ఫార్ములను సకాలంలో పరిష్కరించాలని, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తదుపరి ఫార్ముల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతంగా అమలు పర్చాలని ఆదేశించారు. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీలు నగదు, బహుమతులను విరివిగా పంపిణీ చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు కూడా వస్తున్నాయని.. వాటిపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత నివేదికలను తమకు వెంటనే పంపించాలని ఆదేశించారు. ఎటు వంటి అల్లర్లకు, హింసకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర పోలీస్ శాఖ చేస్తున్న ఏర్పాట్లను లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ శంకబ్రత బాగ్చీ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పటిష్టంగా అమలుతో పాటు ఎన్నికలకు ముందు, ఎన్నికల రోజు, ఎన్నికల తదుపరి అమలు చేయనున్న బందోబస్తు కార్యాచరణ ప్రణాళికను ఆయన వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..