ఏపీలో రేపే పరిషత్ తీర్పు, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, చకచకా ఏర్పాట్లు.. భద్రతా చర్యలు

|

Apr 07, 2021 | 10:17 PM

AP MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మండల పరిషత్‌లపై ఏ జెండా ఎగరబోతోంది? ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు?..

ఏపీలో రేపే పరిషత్ తీర్పు, ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌, చకచకా ఏర్పాట్లు.. భద్రతా చర్యలు
AP Panchayat Elections
Follow us on

AP MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా, మండల పరిషత్‌లపై ఏ జెండా ఎగరబోతోంది? ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అనేదానికి రేపే తీర్పు ఇవ్వబోతున్నారు ఓటర్లు. హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పుతో… పరిషత్‌ ఎన్నికల ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. ఏపీ SEC నీలం సాహ్ని ఎన్నికల ఏర్పాట్ల గురించి ఏపీ సీఎస్‌, ఆదిత్యనాధ్‌ దాస్‌, డీజీపీ సవాంగ్‌తో మాట్లాడారు. పోలింగ్‌ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై చర్చించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని ఆదేశించారు.

నిన్నటి సింగిల్‌ జడ్జి బెంచ్‌ తీర్పుతో పోలింగ్‌ సామగ్రి పంపిణీలో అక్కడక్కడా అయోమయం నెలకొన్నా… సాయంత్రానికి స్పీడప్‌ చేశారు. డివిజన్‌ బెంచ్‌ తీర్పు రాగానే.. పోలింగ్‌కు సిద్ధమయ్యారు సిబ్బంది. రాత్రికల్లా అందరూ కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్లు, గ్లౌజ్‌లను అందించారు. ఓటింగ్‌ సమయంలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని SEC ఆదేశించింది.

మరోవైపు రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 515 ZPTC స్థానాలు, 7,220 MPTC సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. గతంలోనే 126 ZPTC, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ZPTC బరిలో 2,058 మంది, MPTC పోటీలో 18,782 మంది ఉన్నారు. మొత్తం 27,751 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లక్షా 71 వేల 44 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్‌ కేంద్రాలను ప్రాంతాల వారీగా విభజించి భద్రతా చర్యలు తీసుకున్నారు. 6,492 సమస్యాత్మక ప్రాంతాలను, 6,314 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. 247 మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను గుర్తించారు. గిరిజన ప్రాంతాల్లో సిబ్బందికి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

రేపు పోలింగ్‌ జరిగినా… హైకోర్టు తీర్పుతో 10వ తేదీ జరగాల్సిన కౌంటింగ్‌ వాయిదా పడుతుంది. తుది తీర్పును బట్టే ఓట్ల లెక్కింపు ఉంటుంది. మరోవైపు ఈ ఎన్నికలను బహిష్కరించింది తెలుగుదేశం. కానీ చాలా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక వైసీపీ, బీజేపీ, జనసేన అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Read also : NASA Ingenuity Mars Helicopter : అంతరిక్షంలో అద్భుతాలు, నాసా ప్రవేశపెట్టిన ఇన్‌జెన్యుటీ హెలికాఫ్టర్ మార్స్ యానం