
ఆ గ్రామం పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఊరు మాత్రం కనిపించదు. చరిత్రలో కనుమరుగైపోయిన గ్రామాల్లో మిల్లంపల్లి కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఊరు లేకున్నా రెవెన్యూ రికార్డుల్లో మాత్రం మిల్లంపల్లి పేరుతో పంచాయతీ ఇప్పటికీ వాడుకలో ఉంది. ప్రస్తుతం మురారిపల్లె అనే ఊరు మిల్లంపల్లి పంచాయతీలో ఉంది. అయితే మిల్లంపల్లి వాసులు ఏ పని కావాలన్న మురారిపల్లెకు వెళ్లాల్సిందే. ఎందుకంటే గ్రామ సచివాలయం అక్కడే ఉంది. దీంతో అక్కడికి వెళ్లి తమ పనులు చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని మిల్లంపల్లి వాసులు వాపోతున్నారు.
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం మిల్లంపల్లి గ్రామంలో ఓ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. శ్రీకష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయాన్ని అప్పాలమ్మా అనే మహిళా జమీందారు తన యావదాస్థిని ఖర్చుపెట్టి నిర్మించినట్టు చెబుతారు. ఈ ఆలయ మూలవిరాట్టును ముచికుందస్వామి ప్రతిష్టించినట్టు స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ మిల్లంపల్లి వేణుగోపాలస్వామి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తారు. ఈ దేవాలయానికి 80 ఎకరాల పొలం కూడా ఉంది.
ప్రస్తుతం మిల్లంపల్లి ఆలయం సమీపంలో వేగినాటి కోటయ్య కాలనీ ఉంది. ఇక్కడ 200 వరకు ఇళ్లు, 600 వరకు ఓటర్లు ఉన్నారు. వీరంతా సచివాలయం పనుల నిమిత్తం 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురారిపల్లెకు వెళ్లాల్సి వస్తోంది. పేరుకే గ్రామం ఉంది కానీ, ఎలాంటి సదుపాయాలు లేవు. ఈ వేగినాటి కోటయ్య కాలనీ తోపాటు జగనన్న కాలనీని కలిపి మిల్లంపల్లి గ్రామాన్ని ఏర్పాటు చేసి, మురారిపల్లెను సపరేట్ గ్రామ పంచాయతీగా ఏర్పాటు చెయ్యాలని కాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.