
ఏలూరు: మావుళ్ళమ్మ అమ్మవారు భీమవరం గ్రామదేవత.. సాధారణంగా గ్రామదేవతలకు ఆషాడ మాసంలో సారెను సమర్పిస్తారు భక్తులు. కానీ ఈసారి కార్తీకమాసంలో ప్రత్యేకంగా మావుళ్ళమ్మ అమ్మవారికి 1000 కేజీల సారెను సమర్పించారు మావుళ్ళమ్మ మాలధారులు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఇలవేలుపు.. ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మావుళ్ళమ్మ మాలధారణ దీక్షాపరుల.. సారె సమర్పణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం లో దీక్షాధారులు సుమారు 1000 కేజీల పలురకాల స్వీట్స్, పిండివంటలతో సారెను ఏర్పాటు చేసారు. పండ్లు, పువ్వులు – 115 కేజీల బారి లడ్డుతో మావుళ్ళమ్మ అమ్మవారి పూరిగుడి నుండి పట్టణంలోని ఊరేగింపు చేసారు.
మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయానికి చేరుకుని సారెను అమ్మవారికి వైభవంగా సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ భక్తులు తెచ్చిన సారెను తీసుకుని సంప్రోక్షణ జరిపి మావుళ్ళమ్మ అమ్మవారికి సాంప్రదాయబద్దంగా సమర్పణ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు మావుళ్ళమ్మ మాలధారణ దీక్షదారుల పడి పూజ అత్యంత వైభవంగా జరుగుతుందని భక్తులు తరలి వచ్చి ఈ కార్యక్రమం చూసి తరించాలి అని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..