
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. వారం ముందు నుంచే ఏజెన్సీలో సందడి మొదలైపోతుంది. పండుగకు కావాల్సిన సరుకుల కోసం ఏకంగా ఓ సంతే ఏర్పాటవుతోందక్కడ. పేరుకి సంతే అయినప్పటికీ.. అది గిరిజనుల మధ్య అనుబంధం, ఆప్యాయతలు పంచుకునే వేదిక.

వస్తు మార్పిడి విధానంలో ఈ సంతలో సరుకుల కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతాయట. సాంప్రదాయ 'జోరా' ఆ సంతలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. అల్లూరి ఏజెన్సీలో జరిగే తారుమారు సంత విశేషాలివే. అల్లూరి ఏజెన్సీలో జి మాడుగులలో తారు మారు సంత ఉత్సాహంగా సాగింది.

ప్రతి ఏటా సంక్రాంతికి ముందు వచ్చే మంగళవారం జి మాడుగులలో తారుమారు సంత నిర్వహించడం ఆనవాయితీ. గిరిజనులు పండించిన పంటలను సంతకు తీసుకువచ్చి అమ్మకాలు జరిపి.. పండక్కి కావలసిన సామాగ్రి కొనుగోలు చేస్తారు. ఈ సందర్భంగా వేరువేరు ప్రాంతాలకు చెందిన గిరిజనులంతా ఒక చోట చేరి సరదాగా గడుపుతారు. పండక్కి రావాలని బంధువులకు ఆహ్వానిస్తారు.

ఈ సంతకు మరో విశేషం ఉంది. తారుమారు సంతకు తరలివచ్చిన గిరిజనులు తమ బంధువులు స్నేహితులను పిల్లలతో పరిచయం చేసుకుంటారు. యుక్త వయసు వచ్చే పిల్లల పెద్దలు వారి బంధుత్వాల కోసం మాట్లాడుకుంటారు. ఇదే సమయంలో పెళ్లి సంబంధాలు కూడా చూసుకుంటారు. బంధుత్వాలు కుదుర్చుకున్న కుటుంబాలు సంక్రాంతి పండక్కి ఒకరికి ఒకరు ఆహ్వానించుకుంటామని అంటున్నారు నుర్మతి గ్రామానికి చెందిన సూరిబాబు.

జి మాడుగుల గ్రామస్తుడు మణికంఠ. తారుమారు సంతలో ప్రత్యేకమైనది 'జోరా'. అది మర్యాదపూర్వకమైన పలకరించే పద్ధతి. సంతకు వచ్చిన బంధువులు ఎదురుపడినప్పుడు.. మర్యాదపూర్వకంగా ముందుకు వంగి నమస్కరించడమే జొర అంటారు. ఇలా ఈ సంతలో ప్రత్యేకంగా దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి.

కేవలం ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి కాక.. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన గిరిజనులు ఈ సంతకు హాజరవుతూ ఉంటారు. అయితే ఈసారి పంటలు అంత పెద్దగా పండగ పోవడంతో సంతలో సందడి తగ్గిందని అంటున్నారు వ్యాపారులు. తారుమారు సంతని మత్స్యరాస కుటుంబీకులు సాంప్రదాయంగా నిర్వహిస్తామని అంటున్నారు మాజీ మంత్రి మణికుమారి.