
నమ్మిన స్నేహితుడే హంతకుడిగా మారాడు. ఎప్పటినుంచో ఇద్దరు కలిసి మెలసి ఉండేవాళ్లు. కలిసే రౌడీయిజం చేశారు. పోలీసులు తెరిచిన రౌడీషీట్ విషయంలోనూ స్నేహా బంధాన్ని కొనసాగించారు. ఉన్నట్లుండి ఇద్దరి మధ్య వివాదం ఎలా మొదలైందో తెలీదు.. స్నేహితులుగా ఉన్న వారే శత్రువులుగా మారారు. చివరికి ఈ శత్రుత్వం హత్యకు దారితీసింది. విజయవాడ నగరంలో మూడు రోజుల క్రితం జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన కోకూరి రమేష్ను అదే నగరానికి చెందిన ప్రవీణ్ హతమార్చాడు. మూడు రోజుల తర్వాత ఘటన వెలుగులోకి వచ్చింది. మృతుడు కోకూరి రమేష్ న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందినవాడు కాగా.. అతడిపై భవానీపురం పోలీస్ స్టేషన్ లో రౌడిషీట్ ఉంది. అలాగే రమేష్ ను హతమార్చిన నిందితుడు ప్రవీణ్ పై కూడా రౌడీషీట్ ఉంది. వివాహేతర సంబంధమే ఇద్దరు రౌడీషీటర్ల మధ్య మనస్పర్థలకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన కోకూరి రమేష్, హెచ్బీ కాలనీ సమీపంలో ఉండే ప్రియదర్శిని కాలనీకి చెందిన గుంటూరు ప్రవీణ్పైనా రౌడీషీట్ ఉంది. ప్రవీణ్ ఆటోడ్రైవర్. రమేష్ ఏ పని ఉంటే ఆ పనికి వెళ్తుంటాడు. ఇద్దరూ కలిసి ఆయుధాలతో ఇతరులపై దాడులు చేసి, భయభ్రాంతులకు గురిచేస్తుంటారు. వారి ప్రవర్తనలో మార్పులు రాకపోవడంతో పోలీసులు రౌడీషీట్ తెరిచారు. రమేష్కు వివాహం జరిగినప్పటికీ భార్య దూరంగా హెచ్బి కాలనీలో నివాసం ఉంటోంది. అదే ప్రాంతానికి ఎదురుగా ఉండే కాలనీలో ప్రవీణ్ ఉంటున్నాడు. రమేష్, ప్రవీణ్ కలిసి ఎక్కువగా ఆటోలో భవానీపురం ప్రాంతంలోనే తిరుగుతుండేవారు. భవానీపురంలోని అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రవీణ్ తాతయ్యకు ఓ ఇల్లు ఉంది. ప్రస్తుతం ఇది పాతబడిపోయి ఉంది. ఇక్కడికి రెండు రోజుల క్రితం రమేష్, ప్రవీణ్ కలిసి వెళ్లారు. గురువారం రాత్రి ఈ ఇంటి నుంచి దుర్వాసన విపరీతంగా వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
భవానీపురం సిఐ ఉమర్ ఘటనాస్థలానికి వెళ్లి చూసేసరికి రమేష్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసులు ఆరా తీయగా, ప్రవీణ్తో కలిసి రమేష్ వచ్చినట్టుగా స్థానికులు తెలిపారు. దీంతో పోలీసులు ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. స్నేహితుడు ప్రవీణే ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. వివాహేతర సంబంధమే ఇద్దరు రౌడీషీటర్ల మధ్య మనస్పర్థలకు కారణమైందని తెలుస్తోంది. ప్రవీణ్కు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వారిలో పెద్ద అన్నయ్య లారాపై కూడా రౌడీషీట్ ఉంది. కొన్నాళ్ల క్రితం రౌడీషీటర్ల మధ్య వచ్చిన వివాదంలో అతడిని హత్య చేశారు. మరో అన్నయ్య అజయ్పై కూడా రౌడీషీట్ ఉన్నట్లు సమాచారం. వివాదం ఎలా మొదలైందో తెలియదు కాని.. ఈ వివాదం హత్యకు దారితీసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..