
కోనసీమకు చెందిన యువతి ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బెజవాడ వచ్చి ఓ హాస్టల్లో ఉంటోంది. ఆమెకు డేటింగ్ యాప్లో ఓ యువకుడు నెల రోజుల క్రితం పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చాట్ నడిచింది. మత్తైన మాటలు చెబుతూ ఆమెను తన దారికి తెచ్చుకున్నాడు. మాటలతో మేడలు కట్టి.. నా మహారాణివి నువ్వే అన్నాడు. పరిణితి లేకపోవడంతో ఆ యువతి అతడిని నమ్మింది. తన సర్వస్వం అతడే అని భావించింది. పూర్తిగా అతని మాయలో పడిపోయింది. ఈ క్రమంలో ఏకాంతంగా గడుపుదాం రమ్మని ఆమె ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశాడు. చనువుగా మాట్లాడి ఆమెను ట్రాప్ చేసి.. ఏప్రిల్ 22, మంగళవారం సాయంత్రం మాచవరంలో గల ఓ హోటల్కి రమ్మన్నాడు.
హోటల్లోకి వెళ్లగానే.. తన యాక్షన్ ప్లాన్ అమలు చేశాడు ఆ కన్నింగ్ ఫెల్లో. కత్తితో బెదిరించి.. యువతి దుస్తులు విప్పేసి.. వాటితోనే ఆమె కాళ్లు, చేతుల కట్టేసి.. ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని హోటల్నుంచి పారిపోయాడు. కొంత సమయానికి అతి కష్టం మీద కట్లు విప్పుకున్న యువతి.. హోటల్ నిర్వాహకుల సహకారంతో మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సదరు యువకుడు తన వివరాలు బయటకు పొక్కకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు. తన ఫోన్ నెంబర్ కానీ ఇతర వివరాలు కానీ చెప్పకుండా సోషల్ మీడియా, డేటింగ్ యాప్స్ ఎంచుకుని అమ్మాయికి వల వేసినట్లు పోలీసులు చెప్పారు. అయితే సెల్ఫోన్ లొకేషన్, సీసీ టీవీ విజువల్స్ సాయంతో నిందితుడు కిలారి నాగతేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను బాపట్లకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడికి గతంలో కూడా ఇలాంటి క్రైమ్ హిస్టరీ కలిగి ఉందని.. జైలుకు కూడా వెళ్లి వచ్చినట్లు నిర్ధారించారు.
అమ్మాయిలు బయటకు చెప్పుకోలేరని.. నిందితుడు ఈ రకంగా ప్లాన్ చేసి చేశాడని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయ్యే అజ్ఞాత వ్యక్తులను అస్సలు నమ్మవద్దని సూచిస్తున్నారు. చూశారుగా ఈ కన్నింగ్ ఫెల్లో ఎంత పని చేశాడో… అమ్మాయిలూ జర భద్రం…..!
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..