
కర్నూలు, జూన్ 2: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో బెంగళూరు జట్టు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత యువకులంతా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అంతటితో ఆగకుండా వెర్రి చేష్టలకు పని చెప్పారు. బైక్లపై రాజవిహార్ సెంటర్ కు భారీ ఎత్తున చేరుకున్నారు. ఈలలు కేకలు వేస్తూ నలువైపుల నుంచి పెద్ద ఎత్తున యువకులు గుమికూడారు. ఇదే సందర్భంలో అటుగా వెళుతున్నా ఓ ప్రైవేటు బస్సు పై యువకులు రాళ్లు రువ్వడంతో అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలాగే రోడ్లపై టైర్లకు నిప్పు పెట్టి సంబరాలు జరుపుకున్నారు. బారికెడ్లు కూడా చల్లా చెదరుగా తోసేసి అల్లరి చేశారు. యువత రెచ్చిపోయి రెండు బస్సులపై రాళ్లు రువ్వడంతో పోలీసులు స్వల్పంగా లాటి చార్జి చేయాల్సి వచ్చింది. సుమారు గంటసేపు యువకులు ఐపీఎల్ విజయోత్సవం పేరుతో హంగామా చేశారు. ఈ ఘటనపై కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సంఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా సోషల్ మీడియా వీడియోలు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో 18 మంది యువకులు పాల్గొన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. ప్రభుత్వ ప్రైవేటు ప్రజా ఆస్తుల విధ్వంశానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విజయోత్సవాలు పండుగలు ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. అల్లర్లకు పాల్పడిన 18మంది యువకులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు వరకు వారిని కాలినడకన తీసుకెళ్లి న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. సో.. ఇక నుంచైనా పోకిరీలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆశిద్దాం..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.