Pawan Kalyan Slams on YSRCP: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారపార్టీ వైసీపీపై ఘాటుగా స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే.. కానీ.. స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. జనసేన అధికార ప్రతినిధి రాయపాటి అరుణ (Rayapati Aruna) పై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనుచరులు వ్యక్తిగత దూషణలకు దిగడాన్ని పవన్ కల్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణమే.. స్థాయి దాటి ఆడబిడ్డలపై వ్యక్తిగత దూషణలకు దిగి కించపరిస్తే బలంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణకి- ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే పక్కన ఉండేవాళ్ళు అర్థరాత్రి ఫోన్లు చేసి మానమర్యాదలకు భంగం వాటిల్లేలా మాట్లాడటం ఏం పధ్ధతి? ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా సదరు ఎమ్మెల్యేకి రాయపాటి అరుణ తెలిపారు.’’ అని పవన్ పేర్కొన్నారు.
‘‘ఆ విషయాన్ని ప్రసారం చేసిన మీడియాని బెదిరించే విధంగా కేసులు నమోదు చేయడం అప్రజాస్వామికం. ఈ ఘటన విషయంలో ధైర్యంగా ఉండాలని అరుణకి ఫోన్ ద్వారా చెప్పాను. ఆడబిడ్డను వేధించిన ఘటనను ప్రసారం చేసిన టీవీ ఛానెళ్లపై కేసులు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నాను. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియజేసేది ఒక్కటే – మీ అనుచరులకు ఇది పధ్ధతి కాదని చెప్పండి. రాజకీయాల్లో విధివిధానాలపై మాట్లాడుకుంటాం.. అంతే తప్ప వ్యక్తిగత దూషణలకు దిగడం ఆమోదయోగ్యం కాదు. పలు ఛానెళ్లపై (టీవీ9 కాదు) పెట్టిన కేసులు ఉపసంహరించుకొని సమస్యకు ముగింపు పలకాలి.’’ అంటూ పవన్ కల్యాణ్ సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..