యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయి లక్ష్యమంటోన్న పవన్‌, విధానం మారకుండా సాధిస్తారా?

|

Jan 30, 2021 | 9:57 PM

యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయి లక్ష్యం అంటున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. నినాదం బాగున్నా ఆయన విధానం మారకుండా సాధిస్తారా?, అన్న చిరంజీవి సహకారం..

యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయి లక్ష్యమంటోన్న పవన్‌, విధానం మారకుండా సాధిస్తారా?
పవన్ కళ్యాణ్‌ని కలిసి చర్చిస్తున్న కాపు సంక్షేమ సేన ప్రతినిధులు
Follow us on

యాచించే స్థాయి కాదు.. శాసించే స్థాయి లక్ష్యం అంటున్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. నినాదం బాగున్నా ఆయన విధానం మారకుండా సాధిస్తారా?, అన్న చిరంజీవి సహకారం ఉంటుందన్న మాటలకు అర్ధమేంటి? బెజవాడ తీర్మానం సరే.. పవన్ కళ్యాణ్‌ స్థిరత్వం గురించి ప్రశ్నించేవాళ్లకు జనసేనలు ఇచ్చే సమాధానమేంటి.? అనేది ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో చర్చనీయాంశమైంది. కుల, మతాలకు అతీతమంటూ రాజకీయ ప్రయాణం మొదలుపెట్టిన పవన్‌ కల్యాణ్‌ మళ్లీ ‘కాపు’ కాయాల్సి వస్తుందా అనే కొత్త చర్చకు తెరలేచింది.

దశాబ్దాల పాటు కాపు ఉద్యమాన్ని సజీవంగా ఉంచిన ముద్రగడ వైదొలగడంతో ఇప్పటికిప్పుడు ఉద్యమాన్ని అయినా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడిని చూసుకోవాల్సిన అత్యవసర పరిస్థితి. సహజంగానే తనపై భారం వేస్తే చాలు వరాలు కురిపించే పవన్‌కల్యాణ్‌ కూడా కాపులకు అభయ హస్తం ఇస్తున్నారు. సంఖ్యాబలం ఉన్నా కూడా అధికారం అందడం లేదు.. యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళదామంటూ తనదైన శైలిలో భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాపు రిజర్వేషన్లకు.. రాజ్యాధికారంవైపు తీసుకెళ్లేందుకు తన సహకారం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. అటు, అన్న చిరంజీవి మద్దతుపై స్పందించారు పవన్‌‌. సోదరుడి నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందున్నారు జనసేనాని. తమ్ముడిగా తన విజయాన్ని చిరంజీవి కోరుకుంటారని, తాను ఏ కులానికీ పరిమితం కాదన్న పవన్‌కల్యాణ్‌.. కాపుల న్యాయపరమైన పోరాటానికి మాత్రం అండగా ఉంటానన్నారు.

అయితే, పవన్ కల్యాణ్‌ కాపు నినాదం ఎలా ఉన్నా.. వైసీపీ రియాక్షన్‌ మాత్రం డిఫరెంట్గా ఉంది. గతంలో చంద్రబాబును, ఇప్పుడు బీజేపీని యాచించే నువ్వు.. సొంతంగా ఎదిగాక అప్పుడు కాపులను ఉద్దరిస్తే నమ్ముతామంటున్నారు అంబటి రాంబాబు. అన్న సహకారం ఉంటుందన్న పవన్‌ వ్యాఖ్యలపైనా స్పందించారు. అన్న వస్తారని ఆశించకు.. తమ్ముళ్లతో సర్ధుకపో తమ్ముడా అంటూ సటైర్‌ కూడా వేశారు. కాపు ఉద్యమాన్ని నడిపిస్తున్న ముద్రగడను చంద్రబాబు చింత్రహింసలు పెట్టి.. కాపులను చీల్చితే పవన్‌ ఎక్కడున్నారని ప్రశ్నించారు. నాడు ముద్రగడపై రాజకీయ దాడి జరిగితే దాసరి వచ్చారు.. చిరంజీవి అండగా ఉన్నారు. పవన్‌ ఎక్కడున్నారని ప్రశ్నిస్తున్నారు.