
దేశంలో నకిలీ కరెన్సీ నోట్ల బెడద పెరుగుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు, సాధారణ ప్రజలకు పెను సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలు నకిలీ నోట్లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం అత్యవసరం. ఇందుకోసం నిపుణుల నుంచి మేము స్పష్టమైన సమాచారం తీసుకువచ్చాం. కొన్ని ముఖ్యమైన భద్రతా లక్షణాలపై అవగాహన ఉంటే నకిలీ నోట్లను సులభంగా గుర్తించవచ్చు.
రూ.500 నోటుకు సంబంధించిన ప్రధాన లక్షణాలు ఇప్పుడు తెలుసుకుందాం…
1. సెక్యూరిటీ త్రెడ్ (భద్రతా దారం): నోటు మధ్యలో నిలువుగా ఉండే ఈ దారం సాధారణంగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది. నోటును కొద్దిగా వంచినప్పుడు (టిల్ట్ చేసినప్పుడు) ఈ రంగు ఆకుపచ్చ నుంచి నీలం రంగులోకి మారుతుంది. ఇది అత్యంత ముఖ్యమైన భద్రతా లక్షణాలలో ఒకటి.
2. బ్లీడ్ లైన్స్ (ఉబ్బెత్తు గీతలు): నోటు రెండు అంచులలో ఉండే ఈ గీతలు కొద్దిగా ఉబ్బెత్తుగా ఉంటాయి. చేతితో తాకినప్పుడు ఈ ఉబ్బెత్తును స్పష్టంగా గుర్తించవచ్చు. రూ.500 నోటుకు ఐదు బ్లీడ్ లైన్స్ ఉంటాయి. రూ.2000 నోటుకు ఏడు లైన్స్ ఉంటాయి. దృష్టి లోపం ఉన్నవారు కూడా ఈ గీతల ద్వారా నోటు విలువను గుర్తించేందుకు ఇవి సహాయపడతాయి.
3. లేటెంట్ ఇమేజ్ (దాగి ఉన్న చిత్రం): నోటు ఎడమవైపు మూలలో, నిర్దిష్ట కోణంలో చూసినప్పుడు 500 అనే సంఖ్య ముద్రించబడి కనిపిస్తుంది.
4. సీ-త్రూ రిజిస్టర్: నోటు ఒకవైపు 500 సంఖ్యలో సగం మాత్రమే ముద్రించబడినట్లు కనిపిస్తుంది. అయితే, నోటును కాంతికి ఎదురుగా పెట్టి చూసినప్పుడు, ముందువైపు, వెనుకవైపు ఉన్న భాగాలు కలిసిపోయి పూర్తి 500 సంఖ్య కనిపిస్తుంది.
5. వాటర్మార్క్: నోటు కుడివైపు ఖాళీ ప్రదేశంలో, కాంతికి ఎదురుగా చూసినప్పుడు మహాత్మా గాంధీ చిరునవ్వుతో కూడిన చిత్రం కనిపిస్తుంది. నకిలీ నోట్లలో ఈ వాటర్మార్క్ అంత స్పష్టంగా, సహజంగా ఉండదు. నకిలీ నోట్లను తయారుచేసేవారు ఈ చిరునవ్వును యథాతథంగా ముద్రించలేరు.
6. ఐడెంటిఫికేషన్ మార్క్ (గుర్తింపు గుర్తు): రూ.500 నోటుకు కుడివైపున అశోక పిల్లర్ పైన ఒక వృత్తాకారపు ఉబ్బెత్తు గుర్తు ఉంటుంది. దానిలో 500 అని ముద్రించబడి ఉంటుంది. రూ.200 నోటుకు H అక్షరం, రూ.100 నోటుకు వృత్తాకారపు గుర్తు ఉంటాయి.
7. నోటు వెనుక భాగంలోని లక్షణాలు: పాంచ్ సౌ రూపాయ్ అని హిందీలో ముద్రణ, నోటు ముద్రించిన సంవత్సరం, స్వచ్ఛ భారత్ లోగో దాని స్లోగన్తో పాటు, 15 భారతీయ భాషలలో నోటు విలువను సూచించే లాంగ్వేజ్ ప్యానెల్, భారత జెండాతో పాటు ఎర్రకోట చిత్రం వంటి ఉంటాయి
నకిలీ తయారీలో సవాళ్లు:
అసలు నోట్లలో ఉండే ఈ భద్రతా లక్షణాలన్నింటినీ నకిలీ తయారీదారులు 100% నకిలీ చేయలేరని నిపుణులు చెబుతున్నారు. ఎక్కడో ఒకచోట తేడా ఉంటుందని, అవే నకిలీ నోట్లను గుర్తించడానికి కీలకం అని అంటున్నారు.
సాధారణ సందేహాలకు సమాధానాలు:
ఏటీఎమ్లలో నకిలీ నోట్లు వస్తాయా? : బ్యాంకులు ఏటీఎమ్లలో పెట్టే నోట్లను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసి, సార్టింగ్ యంత్రాల ద్వారా పరీక్షించి మంచి నోట్లను మాత్రమే ఉంచుతాయి. కాబట్టి ఏటీఎమ్ల నుంచి నకిలీ నోట్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
దొంగనోటు అని అనుమానం వస్తే బ్యాంకుకెళ్లి చెక్ చేయించుకోవచ్చా?: అనుమానం ఉన్న నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి పరిశీలించుకోవచ్చు. బ్యాంకర్లు ఆ నోటు అసలా, నకిలీనా అని నిర్ధారిస్తారు.
నకిలీ నోటు బ్యాంకు మనకు తిరిగి ఇస్తుందా?: లేదు, బ్యాంకు నకిలీ నోటును తిరిగి ఇవ్వదు. నోటును స్వాధీనం చేసుకుని, దాని మూలం, లావాదేవీ వివరాలతో కూడిన రసీదును వ్యక్తికి జారీ చేస్తుంది. ఒక కాపీ బ్యాంకు వద్ద ఉంటుంది. ఇది వాయిడ్ ట్రాన్సాక్షన్ కిందకు వస్తుంది.
నకిలీ నోటు ఇచ్చిన వ్యక్తికి నష్టం కాదా?: అవును, నకిలీ నోటు చేతిలో ఉన్న వ్యక్తికి అది నష్టమే. ఎవరి దగ్గర నుంచి తీసుకున్నామో వారికి తిరిగి ఇచ్చేందుకు ప్రయత్నించినా, అది నకిలీ నోటు కాబట్టి ఆ లావాదేవీ చెల్లదు.
కేసు పెడతారా? : నకిలీ నోట్ల విషయంలో బ్యాంకులు తమ అంతర్గత విధానాలను పాటిస్తాయి. సాధారణంగా, ఒకేసారి పెద్ద మొత్తంలో నకిలీ నోట్లు పట్టుబడితే లేదా ఉద్దేశపూర్వకంగా నకిలీ నోట్లను చలామణి చేయడానికి ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయి.
నకిలీ కరెన్సీ బెడదను ఎదుర్కోవడంలో ప్రజల అవగాహన, అప్రమత్తత చాలా ముఖ్యం. పైన పేర్కొన్న భద్రతా లక్షణాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా నకిలీ నోట్లను గుర్తించి, వాటి వ్యాప్తిని అరికట్టడంలో ప్రతి ఒక్కరూ కీలక పాత్ర పోషించవచ్చు.
Also Read: రేషన్ బియ్యం తింటున్నారా..? అయితే ఈ విషయం మీరు పక్కా తెలుసుకోవాల్సిందే..