
సాధారణంగా గ్రామాల సరిహద్దుల్లో రాజకీయ నాయకుల ఫ్లెక్సీలో లేదా శుభాకాంక్షల బ్యానర్లు కనిపిస్తాయి. కానీ పోలవరం జిల్లా చింతూరు మండలం గూడూరు గ్రామ పొలిమేరల్లో మాత్రం ఒక వినూత్నమైన హెచ్చరిక బోర్డు వెలిసింది. ‘‘మా ఊరిలోకి ఐస్క్రీం బండ్లు రాకూడదు.. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5,000 జరిమానా విధిస్తాం’’ అన్నదే ఆ బోర్డు సారాంశం. తమ పిల్లల ఆరోగ్యం కోసం గ్రామస్థులంతా కలిసి ఏకగ్రీవంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా గ్రామంలోకి వస్తున్న స్థానిక తయారీ ఐస్క్రీం బండ్ల వల్ల చిన్న పిల్లలు అనారోగ్యం పాలవుతున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.
గూడూరు గ్రామస్థులు ఇలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన మద్యం బెల్ట్ దుకాణాన్ని సైతం ఊరి పెద్దలు చొరవ తీసుకుని తీయించివేశారు. ఇప్పుడు ఐస్క్రీం బండ్లపై నిషేధం విధించడం ద్వారా గ్రామంలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందించాలని వారు నిశ్చయించుకున్నారు. కాగా చిన్న గ్రామమే అయినా, ప్రభుత్వ అధికారులు చేసే తనిఖీల కోసం వేచి చూడకుండా గ్రామస్థులే స్వయంగా ఫుడ్ సేఫ్టీ విషయంలో జాగ్రత్త పడటం అభినందనీయం. కల్తీ ఆహారం పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతుందనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఇతర గ్రామాలు కూడా ఇలాంటి చొరవ తీసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్య సమస్యలు తగ్గే అవకాశం ఉంది.
Ice Cream Ban In Guduru Village 1