
వివాహ బంధంతో ఒక్కటైన గంటల వ్యవధిలోనే ఆ కుటుంబాల్లో తీరని విషాదం నిండింది. పెళ్లి వేడుక ముగించుకుని అత్తారింటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువుతో పాటు ఆమె తల్లి ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన విశాఖపట్నం జిల్లా అగనంపూడి సమీపంలోని శనివాడ వద్ద జరిగింది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వాడచీపురుపల్లికి చెందిన నరసింగరావుకు, అగనంపూడికి చెందిన రామేశ్వరికి బుధవారం (మే 13) రాత్రి 1:58 గంటలకు వైభవంగా వివాహమైంది. వరుడి ఇంటి వద్ద పెళ్లి వేడుకలు ముగిసిన అనంతరం, గురువారం (మే 14)మధ్యాహ్నం నూతన దంపతులు కారులో వధువు ఇల్లు ఉన్న అగనంపూడికి బయలుదేరారు. వరుడు నరసింగరావు స్వయంగా కారు నడుపుతుండగా.. కారులో వధువు రామేశ్వరి, ఆమె తల్లి కనక మహాలక్ష్మి, సోదరి వరలక్ష్మి, బాలుడు నంద కిశోర్ ఉన్నారు.
కారు అగనంపూడి సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా ఒక కుక్క అడ్డురావడంతో, దాన్ని తప్పించబోయి వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో పెళ్లి దండలతో ఉన్న నవవధువు రామేశ్వరి ఘటనా స్థలంలోనే కన్నుమూసింది. తీవ్రంగా గాయపడిన మిగిలిన వారిని చికిత్స నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ వధువు తల్లి కనక మహాలక్ష్మి పరిస్థితి విషమించి మృతి చెందింది. వరుడు నరసింగరావు, వరలక్ష్మి, బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెళ్లయిన కొన్ని గంటల్లోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు కుటుంబాల్లో అంతులేని ఆవేదన, విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..