కంచే చేను మేయడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం.. ఇలాంటి సామెతలు మనం వినే ఉంటాం. తాజాగా తూర్పు గోదవార జిల్లా రాజమండ్రి దానవాయి పేటలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇది అక్షరాల నిజమనిపిస్తుంది. పైన కనిపిస్తున్న ఫొటోలో ఉన్న వ్యక్తిని గమనించారా.? చూడ్డానికి జెంటిల్ మెన్లా కనిపిస్తున్నాడు కదూ! కానీ మనోడు చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆచుకీ తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రకటించారు. ఇంతకీ మనోడు ఏం చేశాడనేగా…
వివరాల్లోకి వెళితే.. అశోక్ అనే వ్యక్తి హిటాచి సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఏటీఎంలలో డబ్బులు డిపాజిట్ చేయడం ఇతని పని. ఈ క్రమంలోనే తాజాగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ. 2.4 కోట్లు విత్డ్రా చేశాడు. బ్రాంచ్ పరిధిలోని హెచ్డీఎఫ్సీ ఏటీఎమ్స్లో డిపాజిట్ చేయాల్సిన నగదుతో ఎంచక్కా ఉడాయించాడు. దానవాయిపేట హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసి పరారయ్యాడు. దీంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సిబ్బంది రాజమండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ మూడేళ్లుగా హిటాచి మేనేజ్ మెంట్ సంస్థలో అశోక్ క్యాష్ ఫిల్లింగ్ బాయ్గా పని చేస్తున్నాడు.
ఈ మొత్తాన్ని 19 ఏటీఎంలలో ఫిల్లింగ్ చేయాల్సి ఉండా అశోక్ సొమ్ముతో పరారయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఓ ప్రకటన చేశారు. నిందితుడు ఫొటోను షేర్ చేసిన పోలీసులు సంబంధిత టోల్ గేట్ల వద్ద చెక్ చేయాలని తెలిపారు. సీసీటీవీలను నిశితంగా గమనిస్తున్నారు. అంత మొత్తం సొమ్ముతో పరార్ కావడంతో ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..