
అమరావతి, ఆగస్టు 13: బంగాళాఖాతంలో మంగళవారం (ఆగస్ట్ 12) ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఈ రోజు (బుధవారం) అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా రాబోయే మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఏపీలో బుధవారం నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం జిల్లాల్లో భారీ వర్షాలు కువరనున్నాయి.
గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు బుధవారం నుంచి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి (బుధవారం) నుంచి మూడు రోజులపాటు రాష్ట్రంలో అత్యంత భారీ వానలు పడే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆ మూడు రోజులు అవసరమైతేతప్ప బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వరద నీరు రోడ్లపై నిలిచిపోకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఎక్కడికక్కడ హైడ్రా చర్యలు చేపట్టింది.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేసినట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కాలేజీలకు బుధవారం సర్కార్ సెలవు ప్రకటించింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్కఫ్రం హోం కల్పించేలా యాజమాన్యాలు చర్యలు చేపట్టాలని సూచించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.