Andhra Pradesh: ఏపీ కొత్తమంత్రులకు ఆరంభంలోనే అపశృతులు.. పోలీసుల అత్యుత్సహానికి ఏడు నెలల చిన్నారి బలి!

|

Apr 16, 2022 | 5:32 PM

ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో అపశృతులు ఆంధ్రప్రదేశ్ అమాత్యుల్ని కలవరపెడుతున్నాయి. కాకతాళీయమా? కావాలని జరిగాయా? అనేది పక్కనపెడితే... జరిగిన ఇన్సిడెంట్స్‌ మాత్రం కొత్త మంత్రుల్నిటెన్షన్‌ పెట్టాయి.

Andhra Pradesh: ఏపీ కొత్తమంత్రులకు ఆరంభంలోనే అపశృతులు.. పోలీసుల అత్యుత్సహానికి ఏడు నెలల చిన్నారి బలి!
Child Dies
Follow us on

Minister Ushasri Charan Welcome Rally: పాపం.. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో అపశృతులు ఆంధ్రప్రదేశ్ అమాత్యుల్ని కలవరపెడుతున్నాయి. కాకతాళీయమా? కావాలని జరిగాయా? అనేది పక్కనపెడితే… జరిగిన ఇన్సిడెంట్స్‌ మాత్రం కొత్త మంత్రుల్నిటెన్షన్‌ పెట్టాయి. ఒక్కరికంటే ఓకే, ఒక్కచోటంటే ఓకే.. అదేంటోగాని, చాలామందివి ఇలాంటి అనుభవాలే. ఏపీలో కొత్త కేబినెట్‌ అలా కొలుదీరిందో లేదో.. అమాత్యులు అలా తమ ఇలాఖాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్‌ కోసం ఏర్పాటు చేసిన స్వాగత సంబరాలు.. ఓ చిన్నారి ప్రాణం తీశాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అనారోగ్యంతో ఉన్న ఏడునెలల చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తున్న వాహనాన్ని.. మంత్రిగారి స్వాగత సంబరాల కోసం నిలిపివేశారట పోలీసులు. దీంతో, ఆస్పత్రికి వెళ్లేసరికి పాప ఆరోగ్యం విషమించి ప్రాణాలు వదిలిందట.

శెట్టూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన.. ఈరక్క, గణేష్‌ల కూతురు పండు అనారోగ్యంతో బాధపడుతోంది.. ఈ క్రమంలో చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌కు ఫోన్‌ చేయగా.. అంబులెన్స్‌ రాలేదు. దీంతో బైక్‌పై కళ్యాణదుర్గం తీసుకెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎంతకీ వదలక పోవడంతో చిన్నారి రోడ్డుపైనే మృతి చెందింది.. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను అడ్డుకోవడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు చిన్నారి తల్లిదండ్రులు. ఈ విషయంలో పోలీసుల వెర్షన్‌ మరోలా ఉంది.. మంత్రి స్వాగత సంబరాల సందర్భంగా.. తామెక్కడా వాహనాలను ఆపలేదంటున్నారు ట్రాఫిక్‌ జామ్‌ వల్లే చిన్నారి మృతి చెందిందనడంలో వాస్తవం లేదంటున్నారు.

ఇదిలావుంటే, మరో మంత్రి కాకాని గోవర్దన్‌ రెడ్డికి ఆదిలోనే పెద్ద ట్విస్ట్‌ ఎదురైంది. నెల్లూరు కోర్టులో జరిగిన ఫైళ్ల చోరీ..పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వర్సెస్‌ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిగా మారిపోయింది సీన్‌. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డే కోర్టులో ఫైళ్లను మాయం చేశారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తుండటం పెద్ద దుమారం రేపుతోంది. మొత్తంగా మంత్రి కాకాణి చుట్టూ తిరుగుతున్న నెల్లూరు కోర్టు కేసులో నిజానిజాలు నిగ్గుతేలాల్సి ఉంది.

అటు, ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు.. శ్రీకాళహస్తి ఆలయంలో చేదు అనుభవం ఎదురైంది. రద్దీ కారణంగా స్వామి దర్శనం కోసం 4గంటలుగా క్యూలైన్లో భక్తులు వేచిచూస్తుండగా.. అదే టైమ్‌కి దర్శనానికొచ్చారు కొత్తమంత్రి సత్యనారాయణ. దీంతో, మరింతసేపు ఎదురుచూడాల్సి వచ్చింది. భక్తులు సొమ్మసిల్లుతున్నా పట్టించుకోరా అంటూ.. భక్తుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ దెబ్బకు, మంత్రి కొట్టు తొలిరోజే గోబ్యాక్‌ నినాదాలు వినాల్సి వచ్చింది.

అమలాపురం వీధుల్లో మంత్రి పినిపె విశ్వరూప్‌ అనుచరులు.. విశ్వరూపం చూపించారు. మంత్రి అయ్యాక తొలిసారి జిల్లాకు వచ్చిన విశ్వరూప్‌కు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పిన స్థానిక నేతలు కరెన్సీ కావరాన్ని ప్రదర్శించారు. ర్యాలీలో నోట్లు వెదజల్లారు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కొమ్ముల కొండలరావు. ఆయన రోడ్డుపై నోట్లు చల్లుతూ ఉంటే… వాటిని పార్టీ కార్యకర్తలు ఏరుకున్నారు. కొందరు జీపులతో ర్యాలీ తీస్తే.. మరికొందరు అత్యుత్సాహంతో బైక్‌లతో విన్యాసాలు చేశారు. మంత్రిగారు మాత్రం.. నోరుమెదపకుండా ఆస్వాధించడం విశేషం.

శ్రీకాకుళం జిల్లాలో కార్యకర్తకు గట్టి షాకిచ్చారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ర్యాలీలో ఓవరాక్షన్‌ చేసిన కార్యకర్త చెంప చెల్లుమనిపించారు ధర్మాన. మంత్రిగా తొలిసారి తన ఇలాఖాకు వచ్చిన ధర్మానకు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు కార్యకర్తలు. ఈ సందర్భంగా కొందరు చేయి పట్టి లాగేందుకు ప్రయత్నించగా.. మంత్రికి కోపం వచ్చింది. దీంతో, కార్యకర్త పై చేయి చేసుకున్నారు. ఇప్పుడీ ఘటన జిల్లాలో చర్చనీయాశంగా మారింది.

Read Also…   Punjab CM: మద్యం సేవించి దామ్‌దామా సాహిబ్ గురుద్వారాకు ముఖ్యమంత్రి.. భగవంత్ మాన్‌పై పోలీసులకు ఫిర్యాదు!