ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు

Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడిని హైటెక్ సేవలకు సిద్ధం చేస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయంలో త్వరలో AI సేవలు అందుబాటులోకి రానున్నాయి. భక్తులకు దర్శనం మరింత సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రద్దీని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు.

ఇంద్రకీలాద్రి దర్శనానికి AI టెక్నాలజీ.. భక్తులకు మరింత సులభమైన సేవలు
Vijayawada Kanaka Durga temple

Edited By:

Updated on: May 15, 2026 | 3:40 PM

AI in Vijayawada Kanaka Durga temple: తిరుమల తరహాలో బెజవాడ దుర్గగుడి హైటెక్ సేవలకు రెడీ అవుతోంది. దేవస్థానం ఇప్పటివరకు టెక్నాలజీ అంటే బ్యాంకులు… ఆఫీసులు… కార్పొరేట్ కంపెనీలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అదే టెక్నాలజీ దేవాలయాలకూ చేరుతోంది. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి ఆలయంలో కూడా త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సేవలు అందుబాటులోకి రానున్నాయి.

తిరుమల తరహాలో భక్తులకు మరింత సులభంగా దర్శనం కల్పించేందుకు దుర్గగుడి అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దేవస్థానం చైర్మన్ బొర్రా గాంధీ వెల్లడించారు. రద్దీ తగ్గించేందుకే ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. దుర్గగుడికి ప్రతి రోజు 70 వేల మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా శుక్ర , శని, ఆదివారం పండుగలు… దసరా సమయంలో అయితే ఇంద్రకీలాద్రి మొత్తం జనంతో కిటకిట లాడిపోతుంది. గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితులు కూడా వస్తుంటాయి.

ఇప్పుడు ఈ సమస్యలకు టెక్నాలజీతో చెక్ పెట్టాలని దేవస్థానం భావిస్తోంది. AI ద్వారా ముందుగానే ఎంతమంది భక్తులు వస్తారో అంచనా వేయడం… ఏ సమయాల్లో ఎక్కువ రద్దీ ఉంటుందో చెప్పడం… తక్కువ రద్దీ ఉన్న టైమ్‌ను సూచించడం వంటి వ్యవస్థలను తీసుకురావాలని ఆలోచిస్తున్నారు..

దర్శనం నుంచి పార్కింగ్ వరకు అన్నీ స్మార్ట్ గానే..

ఇకపై భక్తులకు మొబైల్‌లోనే సమాచారం వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్శనానికి ఎంత సమయం పడుతుంది. ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంది. పార్కింగ్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయి. లడ్డూ కౌంటర్ వద్ద ఎంత వెయిటింగ్ ఉంది. ఇలాంటి వివరాలు AI ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. అంతేకాదు… ఆలయంలో తప్పిపోయిన చిన్నారులను గుర్తించడం… అనుమానాస్పద కదలికలను కనిపెట్టడం… ట్రాఫిక్‌ను నియంత్రించడం కోసం కూడా AI కెమెరాలు ఉపయోగించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు..

ఇప్పటికే తిరుమలలో టెక్నాలజీ వినియోగం వల్ల భక్తులకు చాలా సౌకర్యాలు అందుతున్నాయి. ఇప్పుడు అదే తరహాలో దుర్గగుడిలో కూడా మార్పులు తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం. టెక్నాలజీని ఉపయోగించి రద్దీని నియంత్రించడంతో పాటు దర్శనాన్ని సులభతరం చేస్తాం అని చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు… భక్తుల్లో ఆసక్తి దుర్గగుడిలో AI సేవలు వస్తాయన్న వార్త ఇప్పుడు భక్తుల్లో ఆసక్తి పెంచుతోంది.

అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి నిలబడాల్సిన అవసరం లేకుండా చేస్తే బాగుంటుంది అని కొందరు భక్తులు చెబుతుండగా… సంప్రదాయాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి కాలానికి తగ్గట్టుగా మారుతున్న దేవాలయ వ్యవస్థలో… ఇప్పుడు ఇంద్రకీలాద్రి కూడా కొత్త అడుగు వేయబోతోంది. ఆధ్యాత్మికతకు టెక్నాలజీ జోడిస్తే… భక్తులకు మరింత సౌకర్య వంతమైన దర్శనం దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Follow Us