Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur District: జనాలకి శఠగోపం పెట్టాలనుకుంటే.. దేవుడే వాళ్లకు పెట్టాడు.. దురాశ దు:ఖానికి చేటు..

దురాశ దు:ఖానికి చేటు.. తాటిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు.. ఈ సామెతల్ని వారికి పెద్దవాళ్లు నూరిపోసినట్లు లేరు. దీంతో అత్యాశకు పోయి జనాలకు దొంగనోట్లు ఇచ్చి మాయ చేయాలనుకున్నారు. పథకం అంతా పక్కాగా అమలు చేశారు. కట్ చేస్తే చివరకు వారే మోసపోయారు. ఆ డీటేల్స్...

Guntur District: జనాలకి శఠగోపం పెట్టాలనుకుంటే.. దేవుడే వాళ్లకు పెట్టాడు.. దురాశ దు:ఖానికి చేటు..
Police Station
Follow us
T Nagaraju

| Edited By: Ram Naramaneni

Updated on: Jan 31, 2025 | 7:04 PM

అత్యాశకు పోయి అసలు సొమ్ము పొగొట్టుకున్న బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన జ్యోతి, వెంకటాచలం, విశ్వనాథ్‌లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే వీరికి గుంటూరు జిల్లాకు చెందిన వసుంధర అనే మహిళ పరిచయం అయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో డబ్బులు అవసరం కావడంతో ఈజీగా డబ్బులు వచ్చే మార్గాలపై ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే వసుంధర అనే మహిళ జ్యోతికి పరిచయమై.. ఒకటికి రెండు రెట్లు నకిలీ నోట్లు ఇచ్చే వాళ్లు తనకు తెలుసునని తద్వారా అధికంగా డబ్బులు సంపాదించవచ్చని చెప్పింది. దీంతో జ్యోతి, వెంకటాచలం, విశ్వనాథ్‌లు నకిలీ నోట్లు తీసుకునేందుకు సిద్దమయ్యారు.

ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత చిత్తూరు నుండి గుంటూరు జిల్లాలోని కాజా టోల్ ప్లాజా వద్దకు రావాలని వసుంధర చెప్పింది. దీంతో గురువారం అర్ధరాత్రి సమయంలో జ్యోతి ముఠా పదిహను లక్షల రూపాయల ఒరిజినల్ నోట్లు తీసుకొని కాజా టోల్ ప్లాజా వద్దకు వచ్చింది. అదే సమయంలో వసుంధర పంపించిన ఖాదర్ వలి, నాగూర్ వలిలు ముప్పై లక్షల నకిలీ కరెన్సీ తీసుకొని అక్కడకు వచ్చారు. ఇరు వర్గాల మధ్య డబ్బులు చేతులు మారాయి. అయితే అదే సమయంలో పోలీసులు, పోలీసులు అంటూ ఖాదర్ వలి హడావుడి చేశాడు. దీంతో జ్యోతి వాళ్లు కూడా తమకిచ్చిన నోట్లు ఏంటో చూసుకోకుండా టోల్ ప్లాజ్ వద్ద నుండి దూరంగా వెళ్లిపోయారు.

ఆతర్వాత అనుమానం వచ్చిన జ్యోతి గ్యాంగ్ తమకిచ్చిన బ్యాగ్ లోని నోట్ల కట్టలను పరిశీలించి చూసింది. అయితే ఆ నోట్ల కట్టల మధ్య తెల్ల పేపర్లు పెట్టి పైన కింద మాత్రమే నకిలీ నోట్లను ఉంచి ఇవ్వడం జరిగింది. అయితే అసలు పోలీసులు వచ్చారన్న హడావుడి కూడా ఉద్దేశ పూర్వకంగానే చేసి తమ వద్ద నున్న పదిహేను లక్షల రూపాయల అసలు నోట్లు తీసుకొని పారిపోయినట్లు గుర్తించారు. తమను మోసం చేసిన ఖాదర్ వలి, నాగూర్‌వలిపై మంగళగిరి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలన్న ఆశతోనే అసలు సొమ్ము పొగొట్టుకున్నారని సిఐ శ్రీనివాసరావు తెలిపారు. ఇటువంటి వారి గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వాలన్నారు. అత్యాశకు పోయి డబ్బులు పొగొట్టుకొని కేసుల్లో ఇరుక్కోవద్దని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి