
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న.. నాదెండ్ల భాస్కర్ రావు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే.. పరిస్థితి విషమించడంతో.. బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు పంజాగుట్ట శ్మశాన వాటికలో జరగనున్నాయి. నాదెండ్ల మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. 1935 జూన్ 23న గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కరరావు.. తొలిసారి 1978లో విజయవాడ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత.. సీఎం పదవితోపాటు.. పలు హోదాల్లో సేవలందించారు.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల భాస్కర్రావు వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఎన్టీఆర్తో టీడీపీ పార్టీని ఏర్పాటు చేశారు. 1982 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. ఆ తర్వాత నాదెండ్ల భాస్కర్రావు తన వర్గ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 1984 వ సంవత్సరంలో నుంచి ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెలరోజులపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాదెండ్ల భాస్కర్రావు తన పదవిని కోల్పోయారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధర్మయుద్ధం పేరుతోరాష్ట్ర వ్యాప్త యాత్ర చేపట్టారు. ఈ పరిణామాల తర్వాత నాదెండ్ల భాస్కర్రావు తన పదవికి రాజీనామా చేశారు. ఆ వెనువెంటనే అప్పటి గవర్నర్ రాంలాల్ను కేంద్రప్రభుత్వం వెనక్కి పిలిపించింది. అదే సమయంలో ఎన్టీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించింది.
ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత నాదెండ్ల భాస్కర్రావు కాంగ్రెస్లో చేరారు. 1998లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున లోక్సభకు పోటీచేసి గెలిచారు. 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వయోభారం కారణంగా రాజకీయాలకు నాదెండ్ల భాస్కర్రావు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఆంద్రప్రదేశ్లో మంత్రిగా పనిచేస్తున్నారు.