Andhra Pradesh: కోవిడ్‌ భయం.. మూడేళ్లుగా ఇంట్లోనే.. చివరికి ప్రాణాలమీదకి తెచ్చుకున్న కుటుంబం..

|

Dec 20, 2022 | 8:15 PM

భయం అనేది ఓ వ్యక్తిపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియజేయడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. కోవిడ్ సమయంలో ఏర్పడిన భయం మూడేళ్లు గడుస్తున్నా.. గుమ్మం మెట్టు దాటి బయటకు రాని ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. చివరికి వారి భయం ప్రాణాల మీదకి..

Andhra Pradesh: కోవిడ్‌ భయం.. మూడేళ్లుగా ఇంట్లోనే.. చివరికి ప్రాణాలమీదకి తెచ్చుకున్న కుటుంబం..
Covid 19
Follow us on

భయం అనేది ఓ వ్యక్తిపై ఎంత ప్రభావం చూపిస్తుందో తెలియజేయడానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ ఘటన. కోవిడ్ సమయంలో ఏర్పడిన భయం మూడేళ్లు గడుస్తున్నా.. గుమ్మం మెట్టు దాటి బయటకు రాని ఘటన కాకినాడ జిల్లాలో వెలుగుచూసింది. చివరికి వారి భయం ప్రాణాల మీదకి తెచ్చింది. ఓ ఇంట్లోని తల్లి, కూతళ్లు కోవిడ్ భయంతో ఇంటికే పరిమితమయ్యారు. చివరికి తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వాస్తవానికి కరోనా వైరస్‌ ప్రారంభంలో ప్రతి ఒక్కరూ భయపడేవాళ్లు. దీంతో కేంద్రప్రభుత్వం కూడా కోవిడ్ నియంత్రణలో భాగంగా లాక్‌ డౌన్‌ను అమలు చేసింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌లో పలు సడలింపులిస్తూ వచ్చింది. ప్రజలు సైతం తగిన జాగ్రత్తలు పాటించేవారు. లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటే ఎంతో భయపడేవాళ్లు. ఈ భయం నుంచి బయటపడని కాకినాడ జిల్లా కాజులూరు మండలం కుయ్యేరులోని ఓ కుటుంబం మూడేళ్ల నుంచి ఇంటి నుంచి బయటకు రాలేదు. దీంతో ఓ మహిళ తీవ్ర అనారోగ్యం పాలైంది.

దేశంలో 2020 జనవరిలో తొలి కరోనా కేసు బయటపడింది. అంతటి భయంకర వైరస్ ను గతంలో చూడని దేశం ప్రాణాలు కాపాడుకునేందుకు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత వ్యాక్సిన్లు రావడంతో క్రమంగా లాక్ డౌన్లను ఎత్తివేయగా, ప్రజలు సాధారణ జీవనంలోకి మళ్లీ అడుగుపెట్టారు. కాని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం కుయ్యేరులో ఓ తల్లి, కూతురు మాత్రం కరోనా భయంతో ఇప్పటికీ ఇల్లు దాటి బయటికి రావడంలేదు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి వారిద్దరూ ఇంటికే పరిమితమయ్యారు. తల్లి పేరు మణి, కుమార్తె పేరు దుర్గాభవాని. ఇల్లు దాటి బయటికి వస్తే కరోనా బారిన పడతామనే భయంతో వారు గుమ్మం దాటి బయటకు రావడంలేదు. కరోనా తీవ్రత తగ్గినా, వారిలో భయం మాత్రం అలానే ఉండిపోయింది. దీంతో తల్లి, కూతుళ్లు గదిలోనే ఉండిపోగా.. మణి భర్త వారికి రోజూ అన్నపానీయాలు అందిస్తూ వస్తున్నారు. వారం రోజుల నుంచి మణి భర్తను కూడా వారిద్దరూ గదిలోకి రానివ్వడంలేదు. ఈ విషయాన్ని ఇతరులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

విషయం తెలియడంతో తల్లి, కూతురిని కాపాడేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది చర్యలు ప్రారంభించారు. వారిలో భయం పొగొట్టేందుకు ఎంత ప్రయత్నం చేసినా, వారిలో కోవిడ్ భయం మాత్రం పోవడం లేదు. అంతేకాకుండా కప్పుకున్న దుప్పటి తీయడానికి కూడా వారు భయపడిపోతున్నారు. తల్లి మణి సగం దుప్పటి తీసి మాట్లాడుతుండగా, కుమార్తె దుర్గా భవాని మాత్రం దుప్పటి లోంచి తల కూడా బయటపెట్టడం లేదు. చివరికి మణితో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించగా, తమకు ఎవరో చేతబడి చేశారని మాట్లాడుతుండటంతో వారి మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్లు భావిస్తున్నారు. చివరికి అధికారులు, పోలీసులు తల్లి, కూతుళ్లను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..