AP Tourism: కరువు సీమలో జలకళ.. రెండు నెలలు ఆలస్యంగా ఎత్తిపోతలకు చేరిన వరద నీరు.. చూసినవారికి చూసినంత..

Guntur Tourism News: నిన్నటి నుండి నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుండి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తి పోతలను చూసేందుకు క్యూ కడుతున్నారు. రెండు నెలలు ఆలస్యంగా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంది. అటు సాగర్ ప్రాజెక్ట్ , నాగార్జునుడి కొండ, మ్యూజియంను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇటు ఎత్తిపోతల వద్దకు వస్తుంటారు.

AP Tourism: కరువు సీమలో జలకళ.. రెండు నెలలు ఆలస్యంగా ఎత్తిపోతలకు చేరిన వరద నీరు.. చూసినవారికి చూసినంత..
Ethipothala Waterfalls

Edited By:

Updated on: Sep 04, 2023 | 12:47 PM

గుంటూరు, సెప్టెంబర్ 04: గత నాలుగేళ్లలో ఎప్పుడు లేనంత వర్షాభావ పరిస్థితి ఈ ఏడాది నెలకొంది. పంట పొలాలకు సాగునీరు సైతం అందక అన్నదాతలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిగా ఇప్పటి వరకూ నిండలేదు. తీవ్ర వర్షాభావ పరిస్థితి నేపధ్యంలో వాగులు వంకలు కూడా ఎండిపోయాయి. ఈ కోవలోనే మాచర్ల సమీపంలోని ఎత్తిపోతలకు చుక్క నీరు రాలేదు.

ఈ ఏడాది ఎత్తిపోతలకు నీరు వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు. భారీ వర్షాలు పడిన సందర్భంలో జూలై నెలకే ఎత్తిపోతల జలకళ సంతరించుకుంటుంది. దీంతో ఏపి, తెలంగాణ రాష్ట్రాల నుండి పర్యాటకులు ఎత్తిపోతల వద్దకు వస్తుంటారు. సుధీర్ఘంగా పొడవు, ఎత్తైన కొండల నుండి జారీ పడుతున్న నీటి ప్రవాహం, చూసేందుకు అనువైన ప్రాంతం కావటంతో పర్యాటకులు ఎత్తిపోతలకు క్యూ కడుతుంటారు.

అయితే ఈ ఏడాది నీటి ఎద్దడి నెలకొనడంతో ఇప్పటివరకూ చుక్క నీరు రాలేదు. అటు చంద్రవంక వాగులో నీరున్న సమయంలోనూ లేదంటూ సాగర్ కాలువలు వదిలిన సందర్భంలోనూ ఎత్తిపోతలకు నీరు వస్తుంటుంది. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురకపోవడం, ప్రాజెక్ట్ ల్లో నీరు లేకపోవడంతో ఎత్తిపోతలకు నీరు చేరలేదు.

అయితే నిన్నటి నుండి నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎత్తిపోతలకు నీటి ప్రవాహాం మొదలైంది. మట్టితో కూడిన ఎర్ర నీరు అంత ఎత్తైన కొండల నుండి కిందకు పడుతుండటంతో పర్యాటకులు ఎత్తి పోతలను చూసేందుకు క్యూ కడుతున్నారు. రెండు నెలలు ఆలస్యంగా వరద నీరు ఎత్తిపోతలకు చేరుకుంది. అటు సాగర్ ప్రాజెక్ట్ , నాగార్జునుడి కొండ, మ్యూజియంను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు ఇటు ఎత్తిపోతల వద్దకు వస్తుంటారు.

ఎత్తిపోతల వద్దకు ఎట్టకేలకు నీరు చేరడంతో రెండు రాష్ట్రాల్లోని పర్యావరణ ప్రేమికులతో పాటు పర్యాటకులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారాంతాల్లో వేల సంఖ్యలో పర్యాటకు ఎత్తిపోతలను తిలకించేందుకు వస్తుంటారు. ఈ నెలలో వినాయకచవితి సెలవులు అదే విధంగా వచ్చే నెలలో దసరా సెలవులుండటంతో ఇప్పటి వరకూ పర్యాటకులు లేక వెలవెల బోయిన ఎత్తిపోతల రానున్న రోజుల్లో పర్యాటకులతో కళకళలాడుతుందని స్థానికులు భావిస్తన్నారు.

(నోటు: జోరుగా వర్షాలు పడుతున్నప్పడు ఎత్తిపోతల జలపాతం అందంగా ఉంటుంది. ఇదే కాదు ఏ జలపాతం అయినా అందంగానే ఉంటుంది. కానీ ఇలాంటి ప్రదేశాలకు వెళ్తున్నప్పుడ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు చెప్పిరావు కావునా.. ప్రభుత్వ అధికారుల నుంచి అనుమతి ఉంటే వెళ్తే బాగుంటుంది. చిన్న పిల్లలను ఇలాంటి ప్రదేశాలకు వెంట తీసుకెళ్లడం అంత సరైది కాదు)

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Loading...
Unable to load recommendations.
Follow Us