
విశాఖలో ఓ వ్యక్తి కడుపునొప్పితో తరచూ బాధపడుతూ ఉన్నాడు. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. ఆసుపత్రికి వెళ్తే.. వైద్యులు స్కానింగ్ చేశారు. రిపోర్ట్స్ చూసి వారికి కూడా షాక్ కొట్టనిట్లు అయింది. ఎందుకంటే.. మూత్రాశయంలో కోడిగుడ్డు లాంటి ఆకారంలో ఏవో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సర్జరీ చేయాలని నిర్ధారించారు. శస్త్ర చికిత్స చేసి ఐదు కోడిగుడ్డు సైజ్ రాళ్ళను తొలగించారు.
వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురానికి చెందిన యాభై ఏళ్ల డి.రామకృష్ణ పొత్తికడుపు నొప్పితో గత కొంతకాలంగా బాధపడుతూ ఉన్నాడు. మూత్రవిసర్జనలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. ఇందులో భాగంగా కొన్ని మందులు కూడా వాడాడు. అయినా ఫలితం లేదు. దీంతో ఈనెల 4న షీలానగర్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి వచ్చాడు. డాక్టర్ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వైద్యులు పరీక్షలు చేశారు. మూత్రాశయంలో కోడిగుడ్డు పరిమాణంలో ఏవో ఉన్నట్టు గుర్తించారు. సర్జరీ చేసి విజయవంతంగా లోపల ఉన్న 5 రాళ్ళను తొలగించారు. ఆపరేషన్ అనంతరం రామకృష్ణ పూర్తిగా కోలుకున్నాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. లాప్రోస్కోపిక్ యూరో అంకాలజిస్ట్, అండ్రాలజిస్ట్ సందీప్ మహేశ్వరరెడ్డి నేతృత్వంలో బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. మూత్రం నిల్వ ఉండిపోవడం, అడ్డంకులు, ఇన్ఫెక్షన్ల కారణంగా మూత్రాశయంలో రాళ్లు ఏర్పడతాయని డా.మహేశ్వరరెడ్డి తెలిపారు. మూత్రంలో రక్తం పడడం, నొప్పి, ఇన్ఫెక్షన్లు కలిగినట్టు అనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని సూచించారు. ఇలాంటి సమయాల్లో కాలయాపన చేస్తే ఇబ్బందులు పెరుగుతాయని సూచించారు.
కొన్ని సందర్భాల్లో మూత్రాశయంలో చాలా పెద్ద పరిమాణంలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణంగా చిన్న రాళ్లు మూత్రంతో బయటకు వెళ్లిపోతాయి. కానీ మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం, ఇన్ఫెక్షన్లు, ప్రోస్టేట్ సమస్యలు, ఎక్కువకాలం నిర్లక్ష్యం చేయడం వల్ల రాళ్లు క్రమంగా పెద్దవిగా మారుతాయి.కొన్ని అరుదైన కేసుల్లో అవి కోడిగుడ్డు సైజ్ వరకు కూడా పెరుగుతాయి. అలాంటి రాళ్లు మూత్రాశయంలో ఎక్కువకాలం ఉండటం వల్ల తీవ్రమైన కడుపు లేదా పొత్తికడుపు నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో రక్తం, తరచూ ఇన్ఫెక్షన్లు లాంటి సమస్యలు వస్తాయి. ఈ కేసులో కూడా చాలా రోజులుగా సమస్య ఉండటం వల్లే రాళ్లు అంత పెద్దవిగా పెరిగినట్టు వైద్యులు భావిస్తున్నారు.
అగ్నిగుండంలా మండుతున్న భారత్.. 50 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు.. ఏపీ, తెలంగాణలో