Andhra Pradesh: ‘ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ’.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్

|

Oct 25, 2021 | 3:28 PM

ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి డిగ్రీ కాలేజ్ ఉండాలన్నారు సీఎం.

Andhra Pradesh: ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ.. విద్యార్థులకు మరో గుడ్ న్యూస్
Cm Jagan
Follow us on

పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువే. అందుకే ప్రతి ఒక్క విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నారు AP CM జగన్. ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయడంతోపాటు.. మైక్రోసాఫ్ట్‌లాంటి సంస్థలతో నిరంతరం శిక్షణ కొనసాగించాలని చెప్పారు..అప్పుడు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. వైసీపీ వచ్చిన తర్వాత ఎడ్యుకేషనల్‌గా పరంగా వచ్చిన తేడా ఏంటి అన్నది స్పష్టంగా కనిపించాలని అధికారుల్ని ఆదేశించారు CM జగన్.

గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ లాంటి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమైన విధానాలపై యూనివర్శిటీలు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. అలాగే సబ్‌రిజిస్ట్రార్, టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో పారదర్శకత, పౌరులకు మెరుగైన సేవలు అందించడంపైన అధ్యయనం జరగాలన్నారు. యూనివర్శిటీల్లో అత్యుత్తమ అధ్యాపకుల క్లాసులను సబ్జెక్టుల వారీగా రికార్డ్‌ చేసి.. ఆన్‌లైన్‌లో పెట్టాలని సీఎం సూచించారు. విద్యార్థులు లెసన్స్ సులభంగా అర్థం చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజీ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

ఎన్ని సమస్యలున్నా సరే.. ఫీజు రియింబర్స్‌మెంట్‌ విషయంలో ఎక్కడా లోటు చేయడం లేదని సీఎం చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి కచ్చితంగా జీతాలు ఇస్తున్నామన్నారు.  ఫీజు రియింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడంవల్ల సిబ్బందికి జీతాలు ఇవ్వలేకపోతున్నామనే మాట యాజమాన్యాల నుంచి రాకుండా చూసుకుంటున్నామని చెప్పారు. తల్లుల అకౌంట్లలోకి నేరుగా డబ్బులు వేస్తున్నామని తెలిపారు. కాగా ఇంగ్లీషు మెరుగుపరచడంపైనా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.  బేసిక్‌ ఇంగ్లిషు అన్నది తప్పనిసరిగా సబ్జెక్టుగా పెట్టాలని ఆదేశించారు. దీనివల్ల ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్న సీఎం.. ప్రమాణాలు పాటించని కాలేజీలపై రాజీపడొద్దని సూచించారు. ప్రతివారం ఒక్కో వీసీతో ఉన్నత విద్యామండలి సమావేశాలు నిర్వహించి.. తర్వాత నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు తీసుకురావాలన్నారు.  వీటి పరిష్కారంపై ప్రణాళికలు, చర్యలు తీసుకుంటామన్నారు.  నాణ్యమైన బోధన, ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Also Read: హైనాపై సింహాల మూకుమ్మడి దాడి.. ఈ వీడియో చూస్తే ఒళ్లు జలదరిస్తుంది