
AP CM Jagan meets Minister Nirmala Sitharaman
రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, పోలవరం పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడ బయల్దేరారు.
దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి నిధులు, బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్కు శ్రీనివాసుడి ఫొటో, ప్రసాదాన్ని సీఎం అందించారు. ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి బకాయి ఉన్న రెండున్నర వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వ తప్పు లేకున్నా రుణాలపై ఆంక్షలు విధించడం సరికాదని తెలిపారు.
అలాగే పోలవరం డయాఫ్రమ్వాల్ ప్రాంతంలో చేపట్టాల్సిన మరమ్మతుల కోసం రూ. 2020 కోట్ల అవసరమని వాటిని, వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ నిర్థారించిన పోలవరం ప్రాజెక్టు అంచనాలు రూ. 55,548 కోట్లకు ఆమోదం తెలిపాలని నిర్మలా సీతారామన్కు జగన్ విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి చర్చించిన అంశాలు..
- ఉపాధి హామీ పనులకు సంబంధించి రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు సుమారు రూ.2,500 కోట్లు ఉన్నాయని, వెంటనే ఈ డబ్బు మంజూరుచేయాలని కోరిన సీఎం జగన్.
- రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం తప్పులేకున్నా… రుణాలపై కేంద్రం ఆంక్షలు విధించడం సరికాదని వివరించిన సీఎం. నిబంధనలు ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారని, 2021-22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లుకు కుదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తిచేసిన సీఎం జగన్
- తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరాచేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉందని, ఈ డబ్బును వెంటనే ఇప్పించాల్సిందిగా కోరిన సీఎం జగన్.
- 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయని, వాటిని విడుదల చేసేలా చూడాలని కోరిన సీఎం.
- పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్ గా రూ.10 వేల కోట్లు మంజూరుచేయాలని కోరిన సీఎం జగన్.
- డయాఫ్రంవాల్ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు దాదాపు రూ.2020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదలచేయాలన్న సీఎం జగన్.
- పోలవరం ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఖర్చుచేసిన రూ.2600.74 కోట్ల రూపాయలను సత్వరమే రీయింబర్స్ చేయాలన్న సీఎం జగన్.
- పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్అడ్వయిజరీ కమిటీ రూ. 55,548 కోట్లుగా నిర్థారించింది. దీనికి వెంటనే ఆమోదం తెలపాలని కోరుతున్నాను. దీంతోపాటు ప్రాజెక్టుకు సంబంధించి ఇతరత్రా అంశాలను కూడా చర్చించిన సీఎం జగన్.
- రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిందని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తిచేసిన సీఎం జగన్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం