
రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించి, పర్యావరణ సమతుల్యతను కాపాడడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏయూ క్యాంపస్లో మొక్క నాటి, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రోజురోజుకూ వాతావరణంలో వస్తున్న మార్పులు, విపరీతమైన ఎండలు, తుఫానులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
స్వచ్ఛత – పచ్చదనానికి ఆంధ్రా యూనివర్శిటీ ఒక రోల్ మోడల్గా నిలవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. తిరుమల అడవుల తరహాలో ఏయూలోనూ గ్రీనరీ పెరగాలని, ప్రస్తుతం ఉన్న 25 శాతం పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేలా చర్యలు తీసుకోవాలని ఏయూ వైస్ ఛాన్సలర్ను ఆదేశించారు. 450 ఎకరాల సువిశాల క్యాంపస్ను పర్యావరణహితంగా మార్చేందుకు సీఎం పలు కీలక సూచనలు చేశారు. ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటడంతో పాటు బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. క్యాంపస్ వ్యర్థాలను కంపోస్ట్గా మార్చి, వేస్ట్ టు ఎనర్జీ, బయో గ్యాస్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ ద్వారా ఒక్క చుక్క నీరు కూడా బయటకు పోకుండా, శుద్ధి చేసిన నీటిని చెట్లకు వాడాలని తెలిపారు. పర్యావరణ విద్యపై విద్యార్థులకు ఇదొక నాలెడ్జ్ హబ్గా మారాలి. ఇందుకోసం ప్రొఫెసర్ల బృందంతో ‘నెట్ జీరో’ విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
విశాఖ పోర్టు పరిసరాల్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేతృత్వంలో 2.5 కోట్ల సీడ్ బాల్స్ చల్లడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో, మొక్కలు బాగా పెంచిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు అంటూ సీఎం సరదాగా వ్యాఖ్యానించడం గమనార్హం.
మీడియా సమావేశం ముగిసిన అనంతరం, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సీఎం చంద్రబాబు స్వయంగా సైకిల్ ఎక్కారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఐదున్నర కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఏయూ గ్రౌండ్స్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ 3 టౌన్ పీఎస్ జంక్షన్, పోలమాంబ గుడి, వుడా పార్క్, వైఎంసీఏ, బీచ్ రోడ్ మీదుగా నోవోటెల్ హోటల్ వరకు సాగింది. కేవలం 21 నిమిషాల్లోనే సీఎం ఈ దూరాన్ని చేరుకున్నారు. దారిపొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ సాగిన ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సైక్లింగ్ అనేది కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుందని, దీనిని ప్రతి ఒక్కరూ జీవన విధానంగా మార్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..