
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా.. ప్రజల పండుగగా మార్చాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగానికి గుర్తింపుగా వారికి ఒకసారి ఉచిత విమాన ప్రయాణం కల్పించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆగస్టు 1న ప్రారంభం కానున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.
భూమి ఇచ్చిన రైతులకు గౌరవం
భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులు, భూ యజమానులను ప్రత్యేకంగా గౌరవించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. వారి సహకారానికి గుర్తింపుగా ఒక్కోసారి ఉచిత విమాన ప్రయాణ అవకాశం కల్పించాలని అధికారులకు ఆదేశించారు. రైతుల త్యాగమే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సాధ్యమైందని ఆయన తెలిపారు.
ఉత్తరాంధ్రకు గేమ్ ఛేంజర్
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు. అదే వేదికపై జీఎంఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఏవియేషన్ హబ్-యూనివర్సిటీ, జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యుసిటీకి కూడా శ్రీకారం చుట్టనున్నారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గ్లోబల్ కనెక్టివిటీని తీసుకువచ్చి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి గేమ్ ఛేంజర్గా నిలుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు.
ప్రజల పండుగలా ప్రారంభోత్సవం
భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రతిబింబించే థింసా, సవర, కొమ్ము కోయ నృత్యాలతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకాలని సూచించారు. రేపటి నుంచి జూలై 31 వరకు ఉత్తరాంధ్ర అంతటా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి ఇంటికీ ప్రారంభోత్సవ వేడుకల సందేశం చేరేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే సభకు వచ్చే ప్రజలకు ట్రాఫిక్, పార్కింగ్, భోజనం, తాగునీరు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.