
భర్తను గుడికి తీసుకెళ్లిన భార్య.. బాయ్ ఫ్రెండ్ తో కలిసి అతన్ని చంపేసింది.. ఆ తర్వాత ఏం తెలియనట్లు అక్కడి నుంచి భర్త బైక్పైనే ప్రియుడితో కలిసి పరారైంది.. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో చోటుచేసుకుంది. భర్త ఏడాది బిడ్డతో కలిసి మల్లప్పకొండ దర్శనానికి వెళ్లిన భార్య మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చింది.. అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఈ ఘటన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. వివరాల ప్రకారం.. శాంతిపురం మండలం బోయినపల్లికి చెందిన హాసినికి తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్ తో రెండేళ్ల క్రితం పెళ్లయింది. వీళ్లకు ఏడాది కూతురు ఉంది. హోసూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రమేష్ హాసినిని పెళ్లి చేసుకుని భార్య బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటున్నాడు. అయితే హాసిని చిన్ననాటి స్నేహితుడితో ఉన్న ప్రేమ బంధం కొనసాగించింది.. ఈ ప్రేమబంధం భార్యాభర్తల బంధానికి అడ్డుగా మారింది. 2024 లో రమేష్ తో పెళ్లి జరిగాక కూడా యుగంధర్ అనే యువకుడు అఫైర్ కంటిన్యూ చేస్తూ వచ్చిన హాసిని రెండు రోజుల క్రితం శాంతిపురం మండలంబోయినపల్లిలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చింది. తరచూ పుట్టింటికి వచ్చి స్థానికంగా ఉన్న యుగంధర్ ను కలుస్తూ వస్తున్న హాసిని భర్త రమేష్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం భర్త బైక్ పై బోయినపల్లికి వచ్చిన హాసిని మల్లప్ప కొండకు వెళ్దామని చెప్పి తీసుకెళ్ళింది. భర్త రమేష్ బైక్ పై హాసిని ఏడాది కూతురుతో పయనమైంది. ఇంటి నుంచి మల్లేశ్వర స్వామి దర్శనం కోసం మల్లప్ప కొండకు బయలుదేరిన హాసిని బాయ్ ఫ్రెండ్ యుగంధర్ కు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ వచ్చింది. మల్లప్ప కొండకు ఎక్కుతూ మూడో టర్నింగ్ వద్ద ప్లాన్ చేసినట్టుగానే చేతిలో ఉన్న పర్స్ పడేసింది. పర్సు పడిపోయిందని బైక్ ను హాసిని ఆపేసింది. బైక్ ను అక్కడే వదిలి పడిపోయిన పర్సును తీసుకొచ్చేందుకు వెళ్లిన రమేష్ ను పట్టుకున్న యుగంధర్ బ్యాచ్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్ళింది. అనంతరం యుగంధర్ తో పాటు ఉన్న నలుగురు కలిసి రమేష్ ను హతమార్చి డెడ్ బాడీని అక్కడే వదిలేశారు. అనంతరం రమేష్ బైక్ పైనే యుగంధర్ హాసినిని పికప్ చేసుకొని రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరూ పరారయ్యారు.
మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన రమేష్ ఫ్యామిలీ తిరిగి రాకపోవడంతో.. హాసిని తల్లి తన కూతురు కనిపించడం లేదంటూ నిన్న ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించారు. సాంకేతిక ఆధారాలతో మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. మొదట భర్తతో వెళ్లిన దృశ్యాలు.. ఆ తర్వాత భర్త బైక్ పై మరో ఇద్దరు యువకులతో కలిసి హాసిని వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం.. మల్లప్ప కొండ పరిసరాల్లో రమేష్ డెడ్ బాడీని కూడా గుర్తించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి భర్తను మర్డర్ చేసినట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
హాసినితో పాటు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. పక్కా ప్లాన్ తో హత్య చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. రమేష్ హత్యపై రాళ్ళ బూదుగురు పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కుప్పం డిఎస్పీ పార్థసారథి చెప్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..