Weather Report: మరో అల్పపీడనం.. ఇక అప్పటి వరకు వర్షాలే!
బంగాళాఖాతంలో ఆగస్టు 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలో సెప్టెంబరు 2 వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. రానున్న రెండు రోజుల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సీజన్కు తగ్గ స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇటీవల రాష్ట్రానికి ఎగువ ప్రాంతాల్లో కొన్ని అల్పపీడనాలు ఏర్పడినా.. వాటి ప్రభావంతో ఆశించినంత వర్షపాతం నమోదు కాలేదు. దీంతో రైతులు, ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి వర్షాలపై ఆశలు చిగురిస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమబెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఆగస్టు 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD) తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబరు 2 వరకు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు దేశవ్యాప్తంగా కూడా ఈ ఏడాది వర్షపాతం లోటుగానే నమోదవుతోంది. జూన్ 1 నుంచి ఆగస్టు 26 వరకు దేశంలో సగటు వర్షపాతం 13 శాతం లోటుగా నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 27 శాతం, దక్షిణ భారతదేశంలో 22 శాతం లోటు నమోదైంది. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలంలోనూ కొన్ని ప్రాంతాల్లో వేసవిని తలపించే వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే తాజా అల్పపీడనం వల్ల ఏపీలో వర్షాలు పెరుగుతాయన్న ఆశలు నెలకొన్నాయి.
