ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులకు సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉండనుందో వెల్లడించింది. దీనిక ప్రకారం.. సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్నఉపరితల ఆవర్తనం దక్షిణ అండమాన్ సముద్రం, ప్రక్కనే ఉన్న ఈక్వటోరియల్ హిందూ మహాసముద్రం, మలక్కా జలసంధి గుండా కొనసాగుతుంది. దాని ప్రభావంతో డిసెంబర్ 05 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం వద్ద అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉంది. డిసెంబర్ 07వ తేదీన ఉదయం నాటికి ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండముగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 08న ఉదయం నాటికి పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతం ఆ తర్వాత నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరిని ఆనుకుని దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం చేరుకునే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి.
1. ఉత్తరకోస్తాంధ్రలో ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి పొడివాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
2. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
3. రాయలసీమలో ఇవాళ, రేు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ప్రకటించారు.
ఇదిలాఉంటే.. ఈ మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు వీస్తాయని చెప్పారు వాతావరణ కేంద్రం అధికారులు. పగటిపూట, సాయంత్రం వేళలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతాయన్నారు. శ్వాససంబంధిత సమస్యలు ఎదుర్కొనేవారు, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..