
భానుడి భగభగలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. అటు ఉపరితల ద్రోణి, ఇటు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నైరుతి బంగాళాఖాతంలో రాబోయే 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గంటకు 30-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. అయితే బీహార్ నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో సోమవారం వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలతో కొద్దిరోజులుగా నమోదవుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది.
బీహార్ నుండి జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా కోస్తాంధ్ర తీరప్రాంతం వరకు ద్రోణి కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. శ్రీలంక ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. వీటి ప్రభావంతో కోస్తాంధ్రలో గురువారం వరకు, రాయలసీమలో మంగళవారం వరకు విస్తృతంగా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు. పాత భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు రైతులు, పశు కాపరులు చెట్ల క్రిందకు వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..