AP Panchayat Elections: ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. అయితే రాష్ట్రంలో తొలి విడతలో 453 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. చిత్తూరు జిల్లాలో 96 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, గుంటూరు జిల్లాలో 67 కర్నూలు జిల్లాలో 54, వైఎస్ఆర్ కడప జిల్లాలో 46, శ్రీకాకుళం జిల్లాలో 34, పశ్చిమగోదావరి జిల్లాలో 40, విశాఖ జిల్లాలో 32, ప్రకాశం జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 20, తూర్పుగోదావరి జిల్లాలో 28 ఏకగ్రీవం అయ్యాయి.
ఇక రెండో దశ నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. రెండో దశలో 3,335 పంచాయతీలు, 33,632 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2,598 సర్పంచ్, 6,421 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు కాగా, రెండో రోజు 4,760 సర్పంచ్, 19,659 వార్డు స్థానాలకు నామినేషన్లు వచ్చాయి. గురువారం అఖరు రోజు కావడంతో నామినేషన్లు భారీగా దాఖలు అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 13న రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్, రాత్రిలోగా ఫలితాలు వెల్లడి కానున్నాయి.
కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 1323 నామినేషన్లను తిరస్కరించారు. 12 జిల్లాలలో 3,249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19,491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వాటిలో 18,168 మాత్రమే పోటీకి అర్హత పొందారని ఎస్ఈసీ ప్రకటించింది.
Also Read: ఈ నెల 8 వరకు జైల్లోనే అచ్చెన్నాయుడు.. బెయిల్ పిటిషన్ విచారణ సోమవారానికి వాయిదా వేసిన సోంపేట కోర్టు