Mirchi Price Today: కాసులు కురిపిస్తున్న ఎర్ర’బంగారం’.. రైతన్నలకు పండగే! క్వింటా ధర ఎంతో తెలుసా?

మిరప రైతులకు గిట్టుబాటు ధర దొరక్క యేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టాలు చూసేవారు. దీంతో నష్టాల బాధలు భరించలేక చాలా మంది రైతులు మిరపను సాగుచేయలేమంటూ చేతులెత్తేశారు. ఇక మరికొంతమంది రైతులు చేస్తున్న సాగు విస్తీర్ణంను తగ్గించుని కొద్ది మొత్తంలో మాత్రమే మిరప పంటను పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది పరిస్థితి తారుమారైంది..

Mirchi Price Today: కాసులు కురిపిస్తున్న ఎర్రబంగారం.. రైతన్నలకు పండగే! క్వింటా ధర ఎంతో తెలుసా?
Andhra Pradesh Mirchi Prices Hiked

Updated on: Mar 23, 2026 | 9:15 AM

తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరప పంటకు ప్రపంచ స్థాయిలో గిరాకీ ఎక్కువే. నాణ్యతతోపాటు మంచి రంగు, రుచి, ఘాటు వీటికి ఉంటుంది. అయితే మిరప రైతులకు గిట్టుబాటు ధర దొరక్క యేటా అప్పుల ఊబిలో కూరుకుపోయి నష్టాలు చూసేవారు. దీంతో నష్టాల బాధలు భరించలేక చాలా మంది రైతులు మిరపను సాగుచేయలేమంటూ చేతులెత్తేశారు. ఇక మరికొంతమంది రైతులు చేస్తున్న సాగు విస్తీర్ణంను తగ్గించుని కొద్ది మొత్తంలో మాత్రమే మిరప పంటను పండిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం మిరప పంట రైతులకు కనీవినని రీతిలో కాసులు కురిపించనున్నాయి. అందుకు కారణం మార్కెట్లో మన ఎర్రబంగారానికి ధరలు ఆశాజనకంగా ఉండటమే.

ముఖ్యంగా ఏపీలో జనవరి నుంచి మిర్చి ధరల్లో క్రమ క్రమంగా పెరుగుదల కనిపించింది. క్వింటాలుకు సగటున రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు సగటున క్వింటాలుకు రూ.5 వేలకు పైగానే ధర పెరిగింది. మిర్చికి డిమాండ్ పెరగడంతో వ్యాపారులు నేరుగా గ్రామాలకు చేరుకుని మధ్యవర్తుల జోక్యం లేకుండానే రైతుల వద్ద నుంచి పంట కొనుగోలు చేస్తున్నారు. దీంతో గత నాలుగైదేళ్లుగా నష్టాలను చూసిన మిర్చి రైతులకు తాజా ధరలు ఉపశమనం అందించాయి. మార్కెట్లో మంచి ధర పలకడంతో ప్రస్తుతం శీతల గోదాముల్లో నిల్వ చేసిన సరకు కొద్ది కొద్దిగా తగ్గడం మొదలైంది. ఇక గుంటూరు మార్కెట్ యార్డుకు గత వారంలో 1.29 లక్షల బస్తాల మిరప రాగా.. ఇందులో ఏకంగా 1.26 లక్షల బస్తాల వరకు అమ్ముడయ్యాయి. అయితే మిర్చి సాగు ఈసారి ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. కర్ణాటక, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో సైతం తగ్గింది.

ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్‌ పెరిగినట్లైంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్​లో డిమాండ్ అధికంగా ఉండటంతో జనవరి నెల నుంచే ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది క్వింటాల్‌ మిర్చీ కేవలం రూ. 10 వేలలోపు మాత్రమే పలికింది. ఈ సారి రూ.20 వేలకు పైగానే ధర పలుకుతోంది. తేజ మిర్చి ధర జనవరి, ఫిబ్రవరిలో రూ.15 వేలు ఉంటే ప్రస్తుతం ఏకంగా రూ.19,500కు చేరుకుంది. తాలు రకం కూడా క్వింటాలు ధర రూ.10 వేలకు పైగానే పలుకుతుంది. ఇలా జనవరి నెల నుంచే అన్ని రకాల మిర్చీకి ధరల్లో ఘననీయమైన పెరుగుదల కనిపించింది. పంటలు 50 శాతం తగ్గడం, గోదాముల్లో మిర్చీ నిల్వలు తక్కువగా ఉండటంతో వ్యాపారులు పోటీపడి మరీ పంటను కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్​లో ధరలు ఊపందుకోవడంతో రైతులు మిర్చి పంట కోతలు కోసిన వెంటనే త్వరితగతిన ఆరబెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అన్ని ఖర్చులూ కలుపుకుని ఎకరాకు రూ.4 లక్షల వరకు పంట ఉత్పత్తి వ్యయం అవుతోంది. ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తే సగటున క్వింటాలుకు రూ.18 వేలు వేసిన పాతిక క్వింటాళ్లకు రూ. 4.50 లక్షల వరకు చేతికొచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us