AP News: ఏపీలో గబ్బిలాలు ఉన్న ప్రాంతాల్లో హై అలెర్ట్.. ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాటు

|

Jul 28, 2024 | 9:54 AM

కేరళను నిఫా వైరస్‌ వణికిస్తుండటంతో ఏపీ వైద్యాధికారులు అలర్ట్‌ అయ్యారు. ఈ డేంజరస్ వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తుండటంతో కడప జిల్లా వైద్య శాఖాధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలకు అవగాహన కల్పిస్తుండటంతో పాటు... ముందుగానే క్వారంటైన్‌ సెంటర్‌ను సైతం రెడీ చేశారు.

AP News: ఏపీలో గబ్బిలాలు ఉన్న ప్రాంతాల్లో హై అలెర్ట్.. ప్రత్యేక క్వారంటైన్‌ ఏర్పాటు
Owls
Follow us on

కేరళలో మళ్లీ నిఫా వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. నిఫా వైరస్ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాష్ట్రాలకు స్పష్టం చేసింది. నిఫా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్న చోట క్వారంటైన్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా నిఫా వైరస్ నిర్ధారణ అయితే, ఆ బాధితులను రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించేలా ఏర్పాటు చేశారు. 24 గంటలు అందుబాటులో ఉండేలా వైద్య బృందాన్ని సైతం ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక గదిలో పది మంది బాధితులకు వైద్యం అందేలా బెడ్లను అందుబాటులో ఉంచారు.

గబ్బిలం నుంచి మనుషులకు నిఫా వైరస్‌ 

నిఫా వైరస్ గబ్బిలం నుంచి మనుషులకు సోకే ఒక భయంకరమైన వైరస్. గబ్బిలాలను తినేవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా గబ్బిలాలు తిని వదిలేసిన పండ్లను తినే వారికి కూడా వ్యాధి సోకే  అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. నిఫా వైరస్ సోకిన వారికి జ్వరం, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జలుబు లాంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారని… అలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో గబ్బిలాలు

ఉమ్మడి కడప జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట నియోజకవర్గాలలో గబ్బిలాలు విరివిగా ఉన్నాయి. గబ్బిలాలు చెట్లపై నివాసాలు ఏర్పరచుకుని రాంత్రింబవళ్లు ప్రజలకు అతి దగ్గరగా సంచరిస్తుంటాయి. అయితే రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో గబ్బిలాలు ఉండటం అదృష్టంగా భావిస్తారు ప్రజలు. గబ్బిలాలు ఉన్న వృక్షాల కింద నిద్ర చేయడం, ఆ వృక్షాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అక్కడ గ్రామాలలో ఒక ఆనవాయితీగా వస్తోంది. అయితే నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. అంతేకుండా కడప జిల్లాకు కేరళ రాష్ట్రం పక్కనే కావడంతో అక్కడి నుంచి ఇక్కడకు వలస వెళ్లి వస్తుంటారు. ఇలా ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ వ్యాపిస్తే ప్రమాదమని భావించి క్వరంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.