
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తీసుకువచ్చింది. ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ పాఠశాలల ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఉన్న రిటైర్డ్మెంట్ వయసు 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాలకు పెంచేందుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. అయితే పదవీ విరమణ వయసు పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు, గురుకుల సోసైటీ పాఠశాలల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ కార్పొరేషన్లతో పాటుగా 9, 10 షెడ్యూల్ సంస్థలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులు ఈ పరిధిలోకి వస్తారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశంపై ముగ్గురు మంత్రులతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కమిటీ వివిధ ఉద్యోగ సంఘాలు, నిపుణులు, ఉద్యోగులు, ప్రభుత్వాధికారులతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా పదవీ విరమణ వయస్సు పెంపుపై చర్చించారు. ఒకవేళ ఈ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ప్రభుత్వంపై ఆర్థిక భారం ఎంత పడుతుందనే అంశంపై చర్చ జరిగింది. ఈ అంశాలపై చర్చించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..