Andhra Pradesh: ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే డబ్బులు..

ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 2024 ఖరీఫ్ పంటల బీమా నిధుల విడుదలకు ఎట్టకేలకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఏపీ రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు జమ కాబోతున్నాయి. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీ రైతులకు కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లలోకే డబ్బులు..
Ap Crop Insurance Update

Updated on: Jul 25, 2026 | 8:03 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా నిలిచిపోయిన 2024 ఖరీఫ్ సీజన్ పంటల బీమా పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న క్రమంలో ఈ నిర్ణయం అన్నదాతలకు పెద్ద ఊరటగా మారింది. రాష్ట్రంలో పేరుకుపోయిన ఈ పంటల బీమా సమస్యపై ఏపీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన 2024 ఖరీఫ్ బీమా పరిహారం నిధుల గురించి కేంద్రమంత్రికి వివరించి, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఈ చర్చలు సత్ఫలితాలనివ్వడంతో బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

నేరుగా రైతుల ఖాతాల్లోకే జమ..

రైతు వ్యయప్రయాసలకోర్చి పంట పండించినప్పుడు అనుకోని ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు లేదా అనావృష్టి విరుచుకుపడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాంటి విపత్తుల సమయంలో రైతు కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పంటల బీమా ఒక ప్రధానమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఒకవేళ ఈ బీమా పరిహారం సమయానికి అందకపోతే రైతుల జీవితాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడతాయి. గతంలో విడుదల కావాల్సిన ఈ పరిహారం నిలిచిపోవడంతో రాష్ట్రంలోని వేలాది మంది రైతులు విత్తనాలు, ఎరువుల పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలకు సానుకూల నిర్ణయం తీసుకోవడంతో ఆ డబ్బులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.

కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం..

వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి, అన్నదాతల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా, పూర్తి సమన్వయంతో ముందుకుసాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. క్లిష్ట సమయంలో రైతులకు అండగా నిలిచి, బీమా బకాయిల విడుదలకు సహకరించిన కేంద్ర వ్యవసాయ శాఖకు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వానికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. త్వరలోనే ఈ నిధుల జమ ప్రక్రియ ప్రారంభమై రైతుల చెల్లింపులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

Loading...
Unable to load recommendations.
Follow Us