
భారతదేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పనిచేసిన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సరికొత్త చరిత్ర సృష్టించారు. ‘దేశమే ప్రథమం’ అనే నినాదంతో, గత 12 ఏళ్లుగా ఆయన సాగించిన పాలనపై భారత ప్రజలు అచంచలమైన విశ్వాసం ఉంచారు. ప్రాచీన నాగరికతా సంస్కృతిని ఆధునిక పరిపాలనతో మేళవించి, ప్రపంచ వేదికపై భారతదేశ ఆత్మవిశ్వాసాన్ని ఆయన పునరుద్ధరించారు. మోదీ దార్శనికతతో భారత్ ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. మౌలిక సదుపాయాల కల్పన, సహకార సమాఖ్య విధానంతో 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశ సాధనే లక్ష్యంగా ఆయన భారతదేశాన్ని నూతన స్వర్ణయుగం వైపు నడిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ (TDP) జాతీయ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు రాసిన ఒక ప్రత్యేక వ్యాసం ఇటీవల ప్రముఖ పత్రికలో ప్రచురితమైంది. భారతదేశానికి అత్యధిక కాలం పాటు నిరంతరాయంగా పని చేసిన ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించనున్న ప్రధాని నరేంద్ర మోదీ మైలురాయిపై చంద్రబాబు నాయుడు ఈ వ్యాసంలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ సాధించిన ఈ ఘనత ఆయన నాయకత్వం, దార్శనికతపై భారత ప్రజలు ఉంచిన అచంచలమైన విశ్వాసానికి నిదర్శనమని ఆయన అభివర్ణించారు.
“దేశమే ప్రథమం” అనే సూత్రంపై ఆధారపడిన నరేంద్ర మోదీ పాలనా విధానాన్ని చంద్రబాబు నాయుడు అభినందించారు. “భారతదేశానికి సరైన సమయంలో నరేంద్ర మోదీ సరైన నాయకుడు అని తరచుగా చెబుతూ వచ్చాను. గత 12 ఏళ్లలో ఆ నమ్మకం మరింత బలపడింది. చరిత్ర ఈ కాలాన్ని కేవలం ఆర్థిక వృద్ధి లేదా రాజకీయ స్థిరత్వం కోసం మాత్రమే కాకుండా, భారతదేశానికి తనపై తాను విశ్వాసం పునరుద్ధరించుకోవడానికి దోహదపడిన కాలంగా గుర్తుంచుకుంటుంది” అని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు పేర్కొన్నారు.
తన ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఎందరో ప్రధానమంత్రులను గమనించినట్లు తెలిపిన చంద్రబాబు, ప్రధాని మోదీ వారిలో ప్రత్యేకంగా నిలుస్తారని అన్నారు. దానికి కారణం ఆయన ప్రాచీన నాగరికతా విశ్వాసాన్ని ఆధునిక పరిపాలనతో మేళవించడమేనని స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా దశాబ్దాల పాటు భారతదేశం తన గుర్తింపు పట్ల సంకోచిస్తూ, నిద్రపోతున్న మహాశక్తిలా ప్రవర్తించిందని, అయితే మోదీ నాయకత్వంలో దేశం తన సాంస్కృతిక గర్వాన్ని, జాతీయ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందిందని రాశారు.
యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి భారతదేశపు ప్రాచీన జ్ఞాన వ్యవస్థలను ఆధునిక సాంకేతికత, డిజిటల్ పాలనతో అనుసంధానించడం ద్వారా ప్రధాని మోదీ 21వ శతాబ్దానికి సరికొత్త మార్గదర్శకత్వం వహించారని సీఎం చంద్రబాబు కొనియాడారు. గత ఒక దశాబ్ద కాలంలో భారతదేశం ప్రపంచంలో 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం ఈ వ్యూహాత్మక మార్పునకు నిదర్శనమన్నారు.
పాలనా సంస్కరణల గురించి ప్రస్తావిస్తూ.. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, జన్ ధన్ ఖాతాలు, ఆధార్ అనుసంధానం, యూపీఐ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీల ద్వారా మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమాలలో ఒకటి జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు. గతంలో లీకేజీలు, మధ్యవర్తుల వల్ల సంక్షేమ పథకాలు పేదలకు చేరేవి కావని, అయితే సాంకేతికత సహాయంతో మధ్యవర్తులను తొలగించి, రూ. 51 లక్షల కోట్లకు పైగా నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయడం ఒక విప్లవాత్మక మార్పు అని చంద్రబాబు కొనియాడారు.
కరోనా మహమ్మారి, భౌగోళిక రాజకీయ సంఘర్షణలు, ఆర్థిక అనిశ్చితి వంటి అపూర్వమైన సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటున్న తరుణంలో కూడా భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా స్థిరంగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు. రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలు, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో మోదీ చేస్తున్న దీర్ఘకాలిక పెట్టుబడులు తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, దేశ ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాదులని అభిప్రాయపడ్డారు.
కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలలో పోటీతత్వ, సహకార సమాఖ్య విధానాన్ని తీసుకురావడం ద్వారా రాష్ట్రాలను జాతీయ అభివృద్ధికి కీలక చోదక శక్తులుగా మార్చారని చంద్రబాబు ప్రశంసించారు. ఈ అభివృద్ధి ఆధారిత భాగస్వామ్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మౌలిక సదుపాయాలు, పారిశ్రామికీకరణ, అమరావతి ప్రాజెక్టుల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతోందని ఆయన స్పష్టం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో 2047 నాటికి ‘వికసిత్ భారత్’ దార్శనికత వైపు దేశం స్థిరంగా పయనిస్తూ, ఒక నూతన స్వర్ణయుగానికి నాంది పలుకుతోందని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu’s article on Prime Minister Modi becoming India’s longest-serving continuously elected Prime Minister is a powerful reflection on a transformative era in India’s history.
Naidu ji argues that Prime Minister Modi’s greatest… pic.twitter.com/bwPdrilcu2
— Amit Malviya (@amitmalviya) June 9, 2026
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..