
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనుల చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం మొదలైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ప్రతిష్టాత్మక బంగారు గని ఉత్పత్తి దశకు చేరుకుంది. బుధవారం (జూన్ 24) ఈ భారీ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. రాయలసీమ గడ్డపై వెలుగు చూసిన ఈ బంగారు గని, రాబోయే రోజుల్లో భారతదేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేయనుంది. దేశంలోనే ఏపీని అతిపెద్ద బంగారు సరఫరాదారుగా నిలబెట్టబోతోంది.
ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనింగ్ క్షేత్రంలో కీలకమైన విభాగాలను పరిశీలించారు. మైనింగ్ జరిగే ప్రాంతంలో ఖనిజంతో కూడిన మట్టిని సురక్షితంగా తరలించేందుకు సిద్ధం చేసిన భారీ లారీలు, టిప్పర్ వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు, మైనింగ్ ల్యాండ్స్కేప్లో అత్యాధునిక సాంకేతికత వినియోగాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు, ప్రాజెక్టు నిర్వాహకులను అభినందించారు.
ఈ ప్రాజెక్టు ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం, మైనింగ్ సంస్థ అడుగులు వేస్తున్నాయి. మైనింగ్ ప్రాంతంలో నడిపే భారీ వాహనాలను నైపుణ్యంతో నడిపేలా ఏర్పాటు చేసిన సిమ్యులేటర్ యంత్రాల శిక్షణా కేంద్రాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. స్థానిక మహిళలకు, యువతకు ఈ అత్యాధునిక సిమ్యులేటర్లపై డ్రైవింగ్ శిక్షణ ఇస్తున్న తీరును ఆయన అడిగి తెలుసుకున్నారు. మహిళలు సైతం ఈ భారీ మైనింగ్ వాహనాలను నడిపేలా ఇక్కడ శిక్షణ పొందడం విశేషం.
గత కొంతకాలంగా జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగిన బంగారం వెతికితీత పనులు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి. దాంతో, ఇప్పుడు కమర్షియల్ ఉత్పత్తికి లైన్ క్లియర్ అయింది. భారతదేశంలోనే ప్రైవేట్ భాగస్వామ్యంతో జరుగుతున్న అతిపెద్ద బంగారు గనుల ప్రాజెక్టులలో ఇది ఒకటి కావడంతో దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం దృష్టి దీనిపై పడింది.
రాయలసీమ దశ తిరగనుంది: సీఎం చంద్రబాబు
ప్రాజెక్టు ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభలో మాట్లాడారు. ఏపీని బంగారుమయమైన ఘన చరిత్ర వైపు నడిపించేందుకు ఈ ప్రాజెక్ట్ ఒక మైలురాయిగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాయలసీమ వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేస్తూ, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ద్వారా ఇక్కడి వేలాది మంది యువతకు, మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా, అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మైనింగ్ ప్రక్రియ సాగుతుందని సీఎం వెల్లడించారు.
ప్రముఖ జ్యువెలరీ సంస్థలకు పసిడి అందజేత
ఇదిలావుంటే, జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న ‘జియోమైసూర్’ (GeoMysore) సంస్థ ఈ సందర్భంగా ఒక కీలక ప్రకటన చేసింది. ఏపీలో ఉత్పత్తి అయ్యే బంగారాన్ని ఇతర ప్రాంతాలకు తరలించకుండా, స్థానిక వ్యాపారులకే విక్రయిస్తామని స్పష్టం చేసింది. దీనివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థకు భారీగా ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్రంలోని స్వర్ణకారులకు, వ్యాపారులకు నాణ్యమైన బంగారం నేరుగా లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. జొన్నగిరి మైనింగ్ క్లియరెన్స్ అనంతరం శుద్ధి చేసిన బంగారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని పలు ప్రతిష్టాత్మక జ్యువెలరీ కంపెనీల అధినేతలకు అధికారికంగా అందజేశారు.
జూన్ 25 గురువారం నుంచి అధికారికంగా బంగారం తవ్వకాలు ఊపందుకోనుండటంతో, జొన్నగిరి ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరడమే కాకుండా, దేశీయంగా బంగారు లభ్యత పెరిగి విదేశీ దిగుమతుల భారం కూడా తగ్గనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..